తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయం వేడెక్కుతుంది.ఈ సారి ప్రధాన పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలతో పాటు కమల్ హాసన్ ఎంఎన్ఎం, రజినీకాంత్ కొత్త పార్టీలు ప్రధాన పోటీదారుగా మారబోతున్నాయి.
ఇక బీజేపీ కూడా తమిళ రాజకీయాలలో పాగా వేయడానికి పావులు కదుపుతుంది.ఇప్పటి వరకు ఉత్తరాదిలో ఉన్న తమ ఆధిపత్యాన్ని దక్షిణాదికి కూడా విస్తరించుకోవాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ తమిళనాడు ఎన్నికలపై ప్రధాన దృష్టి పెట్టింది.
రజినీకాంత్ ని ఉపయోగించుకొని తమిళనాడులో పాగా వేయాలని ఓ వైపు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు తమిళనాడులోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలకి కూడా గాలం వేస్తుంది.అలాగే సామాజికవేత్తలుగా ఉన్న వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.
అందులో భాగంగా తమిళ స్టార్ హీరో విశాల్ బీజేపీలో చేరబోతున్నాడు అంటూ ఒక ప్రచారం తెరపైకి వచ్చింది.తమిళనాడు రాజకీయాలపై మొదటి నుంచి ఆసక్తి చూపించే అతను సినిమా ఇండస్ట్రీకి చెందిన రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే విశాల్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడుతో కలవబోతున్నారని, పార్టీ కండువా కప్పుకుంటారు అంటూ ప్రచారం జరిగింది.తాజాగా ఓ చానల్ ఇంటర్వ్యూలో దీనిపై విశాల్ క్లారిటీ ఇచ్చాడు.
తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నాడు.అంతేకాదు, బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.
మొత్తానికి విశాల్ ప్రకటనతో తమిళ రాజకీయాలలో వినిపిస్తున్న ఈ ఊహాజనితమైన ప్రచారంకి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.అయితే విశాల్ రాకున్న ఏదో ఒక విధంగా తమిళ రాజకీయాలలో డబుల్ డిజిట్ సీట్లు సొంతం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ పార్టీ అక్కడ పేరున్న అందరిని తన పార్టీలోకి లాక్కునే ప్రయత్నం చేస్తుందనేది అక్కడ వినిపిస్తున్న మాట.