తెలంగాణ హై కోర్ట్ లో రెబెల్ స్టార్ ప్రభాస్ కి చుక్కెదురైంది.హైదరాబాద్ లో రాయదుర్గ్ పాన్ మక్తాలో గల 2,083 చదరపు గజాల భూమిని, అతిథి గృహాన్ని తిరిగి ప్రభాస్ కి అప్పగించడానికి హై కోర్ట్ తిరస్కరించింది.
గతేడాది డిసెంబర్ లో ప్రభాస్ అతిథి గృహాన్ని ,భూమి ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అయితే ప్రభాస్ భూమిని స్వాధీనం చేసుకునే సమయం లో అధికారులు విధివిధానాలు పాటించకుండా కాస్త దూకుడు గా ప్రవర్తించారు అంటూ కోర్ట్ రెవెన్యూ అధికారులకు మొట్టికాయలు వేసింది.
ఈ విషయం లో ప్రభాస్ క్రమబద్దీకరణ కొరకు దరఖాస్తు పెట్టుకున్నాడు.అతని దరఖాస్తు పరిశీలించిన జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన డివిజన్ బెంచ్ 8 వారాలలో అతని దరఖాస్తు ను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్ట్ ఆ భూమి సిఎస్-7 లిటిగేషన్ జోన్ లో ఉందని తేల్చింది.ప్రభాస్ భూమిని స్వాధీనం చేసుకునేటప్పుడు రెవెన్యూ అధికారులు తగిన ప్రక్రియను అనుసరించలేదని, బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని కోర్ట్ పేర్కొంది.
ప్రభాస్ దరఖాస్తు విషయంలో జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా ఈ వందల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కోరుతున్న మిగిలిన వారు కూడా అదే రీతిలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని హైకోర్టు తెలిపింది.ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే, ఆ భూమి అతని స్వాధీనమవుతుందంది.ప్రభుత్వం అతని దరఖాస్తును తిరస్కరిస్తే అతను కోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది.
భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్ సేల్ డీడ్ల ద్వారా ఆ భూములపై సంక్రమించిన హక్కులను వదులుకుని, ప్రభుత్వం నిర్ణయించిన క్రమబద్దీకరణ ఫీజు చెల్లిస్తే, అప్పుడు ప్రభుత్వం ఆ భూములను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని హైకోర్టు తెలిపింది.