జనసేన – వైసీపీ పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి అనేక అనేక ఊహాగానాలు … కథనాలు ప్రచారంలో ఉన్నాయి.ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి నడవబోతున్నట్టు కూడా అనేక వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలో వారిద్దరూ తప్పనిసరిగా కలిసి పోటీ చేయాలంటూ … ఓ సినీ నటి అభ్యర్ధించారు.వివరాల్లోకి వెళ్తే… పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నటి అపూర్వల మధ్య గత కొంతకాలంగా ఓ వివాదం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో నటి అపూర్వ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని నటి అపూర్వ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో తాను ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలతో ఆయన అనుచరులు తనను టార్గెట్ చేసి టార్చర్ చేస్తున్నారని అపూర్వ వాపోయారు.తన కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దెందులూరులో చింతమనేని ఆగడాలు శ్రుతి మించాయని, తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అపూర్వ ఆరోపించారు.
వైసీపీ అధినేత జగన్కు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అపూర్వ ఓ విన్నపం చేశారు.వచ్చే ఎన్నికల్లో దెందులూరులో ఇద్దరూ కలిసి పని చేయాలని, చింతమనేని ఓడించాలని అభ్యర్థించారు.
జగన్, పవన్ పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా.దెందులూరులో మాత్రం కలిసి పని చేయాలని అపూర్వ కోరారు.