తెలంగాణ కాంగ్రెస్ కు ఆశాకిరణంగా కనిపిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా చిక్కుల్లో పడినట్టుగా కనిపిస్తోంది.ఆయన పై భూకబ్జా ఆరోపణలు రావడం, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రభుత్వం సంపాదించడంతో ఆయన కేసుల్లో నిండా మునిగిపోయినట్టు కనిపిస్తోంది.
కొద్దిరోజుల క్రితమే పట్నం గోస పేరుతో మల్కాజ్ గిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో యాత్ర చేపట్టారు రేవంత్.ఆ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ అనేక ఆరోపణలను రేవంత్ గుప్పించారు.
ఈ సందర్భంగా అనేక అవినీతి ఆరోపణలు కూడా కేసీఆర్, కేటిఆర్ మీద రేవంత్ చేయడంతో గతంలో ఆయన మీద ఉన్న ఆరోపణలు, కేసులు అన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.
శేర్ లింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తవ్వి తీసింది.
ఈ సందర్భంగా రేవంత్ అక్రమాలకు సహకరించారనే ఆరోపణలతో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.అంతేకాకుండా ఈ వివాదంపై రాజేంద్రనగర్ ఆర్దీవోను విచారణకు నియమించింది.
దీంతో రాజేంద్రనగర్ ఆర్దీవో చంద్రకళ క్షేత్రస్థాయిలో ఈ భూకబ్జా ఆరోపణలపై విచారణ చేసి అక్కడ ఆక్రమణ జరిగినట్లుగా నిర్ధారిస్తూ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు మంగళవారం నివేదిక అందించారు.అంతేకాకుండా ఇప్పటికే ఈ భూమికి సంబంధించిన వివాదం, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు హైకోర్టు, జిల్లా, రెవెన్యూ కోర్టులో పెండింగ్ లో ఉండగా, చందానగర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి.
ఇప్పుడు ఆర్దీవో ఇచ్చిన నివేదికలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఆధీనంలో ఉన్న సర్వే నెంబర్ 127 లోని భూమికి చుట్టూ ప్రహరీ నిర్మించి దానికి గేటు ఏర్పాటు చేసినట్లు ఆర్డిఓ తన నివేదికలో పేర్కొన్నారు.ఈ నివేదిక ఆధారంగా రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి నీటి ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా ప్రహరీ నిర్మించినట్లు ఆర్దీవో తన నివేదికలో పేర్కొన్నారు.దీంతో రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు వాల్టా చట్టం తో పాటు, ప్రైవేటు కేసులు కూడా నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.వీటి ఆధారంగా రేవంత్ ఆయన సోదరుడిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇంత జరుగుతున్నా రేవంత్ కు మద్దతుగా నిలిచేందుకు పార్టీ నేతలు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.రేవంత్ రెడ్డి అడ్డు తొలగిపోతే తమకు లైన్ క్లియర్ అవుతుంది అన్నట్లుగా కొంతమంది సీనియర్ నాయకులు ఆనందంగా ఉండడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలను తెలియజేస్తున్నాయి.