ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు గత కొంత కాలంగా టిడిపి లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కాకపోతే ఆ ఇబ్బందులను పైకి చెప్పుకోలేక సతమతం అవుతున్నారు.
ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవారు కావడం, జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయగలగడం, ముక్కుసూటిగా ఏ విషయంపైనా మాట్లాడగలగడం, ధైర్యంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయగల సత్తా, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న నాయుడు ను చంద్రబాబు నియమించారు.ఈ నియామకంపై లోకేష్ తీవ్రంగా అభ్యంతరం పెట్టినా, చంద్రబాబు మాత్రం టిడిపిని మళ్లీ అధికారంలోకి తీసుకు రావాలి అంటే ఖచ్చితంగా అచ్చెన్న వంటి ధైర్యవంతులు అధ్యక్షులుగా ఉండాల్సిందే అనే అభిప్రాయంతో చంద్రబాబు ఆయనను నియమించారు.
మొదట్లో అచ్చెన్న తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు.పార్టీపై పట్టు సాధించేందుకు ప్రయత్నించేవారు.నియోజకవర్గ, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులతో సఖ్యత గా మెలుగుతూ ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ పదవికి న్యాయం చేసేవారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాబోయే హోం మంత్రిని తానే అని అనేక సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానించే అంతగా ఆయనకు పార్టీలో ప్రాధాన్యం దక్కింది.
అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అచ్చెన్న రాజకీయ భవిష్యత్తును గందరగోళం లో పడేశాయి.ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా ఓ ప్రైవేట్ హోటల్లో అచ్చెన్న పార్టీ పైన, లోకేష్ పైన చేసిన విమర్శలు పెద్ద సంచలనమే సృష్టించాయి.
ఇక ఆ తరువాత ఆయన ను అధ్యక్షుడు గా తప్పిస్తారు అని అంతా భావించినా, చంద్రబాబు మాత్రం సైలెంట్ గా ఉన్నారు.
అయితే అప్పట్లో ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు అచ్చెన్న కు ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు .ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు.పార్టీ సీనియర్లు ఎవరికివారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, పార్టీ పరువు బజారున పడేస్తున్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కాల్వ శ్రీనివాసులు పై బండారు శ్రావణి వర్గీయులు వాగ్వాదానికి దిగారు.ఎస్సీ నియోజకవర్గంలో ఒసీల పెత్తనం ఏంటి అని ఆమె ప్రశ్నించారు.
అలాగే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ , మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇదే రకంగా విమర్శలు చేయడం, వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత అచ్చెన్న పైన ఉన్నా, అన్ని వ్యవహారాలను చంద్రబాబు, లోకేష్ ఎక్కువగా కల్పించుకుంటూ అచ్చెన్న పాత్రను నామమాత్రం చేస్తుండడంతో, క్రమక్రమంగా ఆయన ప్రాధాన్యం టిడిపిలో తగ్గుతుందా అనే అనుమానాలు పార్టీ నాయకుల్లో తలెత్తుతున్నాయి.