నోటుకు ఓటు కుంభకోణంలో తెలంగాణ ఏసీబీ అధికారులు మరో వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అతని పేరు ‘జనార్దన్’.
ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ కేసులోని మరో నిందితుడితో మొబైల్ ఫోన్ ద్వారా ముప్పయ్ రెండు సార్లు మాట్లాడారు.ఆ సంభాషణల్లో ‘జనార్ధన్’ అనే పేరు పదే పదే వినిపించింది.
ఈ విషయం ఏసీబీ అధికారులు కోర్టుకు తెలియచేశారు.సండ్ర వెంకట వీరయ్య నుంచి చాలా సమాచారం రాబట్టాల్సివుందని, ఆయన్ని ఐదు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోరడం, కోర్టు రెండు రోజులు మాత్రమే అనుమతించడం తెలిసిందే.
కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఏసీబీ అధికారులు సండ్రను ప్రశ్నించారు.రేపు (శుక్రవారం) కూడా ప్రశ్నించాల్సి ఉంది.
జనార్థన్ అనే కొత్త పేరు వినబడటంతో ఏసీబీ అధికారులు ఇక ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీన్నిబట్టి ఈ కేసు ఇప్పటితో అయిపోదని అర్థమవుతోంది.
ఆ జనార్థన్ను అరెస్టు చేస్తే ఇంకే పేర్లు బయటకు వస్తాయో….! నోటుకు ఓటు కుంభకోణం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
ఒక్క ఎమ్మెల్యే ఓటు కోసం టీడీపీ నాయకులు చాలా ప్రయాస పడ్డారు.ఒక్క వ్యక్తితో మాట్లాడ్డం కోసం మధ్యలో ఎందరో ‘మధ్యవర్తులు’ ఉన్నారు.
ఒక్క ఓటు కోసం ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేయాలా అనిపిస్తోంది.నోటుకు ఓటు కుంభకోణం గూఢచార సినిమాను తలపిస్తోంది.
టీడీపీకి బలం లేనప్పుడు ఇంత ప్రయాస పడి టీఆర్ఎస్ను ఎదుర్కోవాలా? ఇక ఎప్పుడూ ఎన్నికలే జరగనట్లుగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవకపోతే ప్రపంచమంతా తలకిందులవుతుందా? ఒక్క ఓటు కోసం కోట్ల రూపాయలు తగలెయ్యాలా? మిగిలిన రాజకీయ నాయకులైనా టీడీపీ నాయకులను చూసి బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుందేమో….!
.