ఏపీలో తెలుగు దేశం పార్టీకి రాజకీయంగా అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు.ఎంత కష్టపడినా ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదు అన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే చాలామంది కీలక నాయకులు బిజెపిలో చేరిపోతూ టీడీపీకి మరింత షాక్ ఇస్తున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టాలంటే బిజెపి కి దగ్గరవ్వాలనే ఆలోచన చంద్రబాబులోనూ బలంగా కనిపిస్తోంది.
ఇదే సమయంలో తనకు అత్యంత సన్నిహితుడు, అనధికారిక రాజకీయ సలహాదారు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ఢిల్లీ వెళ్లడం అక్కడ కేంద్ర హోంమంత్రి బిజెపి అమిత్ షా తో ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే ఐతే బిజెపి పెద్దల ఆహ్వానం మేరకే తాను ఢిల్లీ వెళ్లానని రాధాకృష్ణ చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీకి రాధాకృష్ణకు అవినాభావ సంబంధం ఉంది.ఆయన మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహారాలు నడుపుతూ వస్తున్నారు.గతంలో టిడిపి బిజెపి మధ్య బంధం ఏర్పడడానికి, ఆ తర్వాత విడిపోవడానికి కారణం రాధాకృష్ణ సలహాలేనని ప్రచారం కూడా ఉంది.టిడిపి, బిజెపి విడిపోయిన తర్వాత రాధాకృష్ణకు చెందిన మీడియాలో పెద్ద ఎత్తున బిజెపి వ్యతిరేక కథనాలు వచ్చాయి.
ఇక వైసిపి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాధాకృష్ణ అనేక వేధింపులకు గురవుతున్నాడు.నిబంధనల ప్రకారం తన పత్రికకు ఛానల్ కు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాల్సి ఉన్నా వైసీపీ ప్రభుత్వం ఇవ్వడంలేదు అనే బాధ ఆయనలో ఎక్కువగా కనిపిస్తోంది.
ఇదే సమయంలో వైసీపీ ఇబ్బందులకు గురయ్యేలా అనేక కీలక పరిణామాలు ఏపీలో జరగడంతో రాధాకృష్ణ కు చెందిన మీడియా పెద్ద ఎత్తున వైసీపీని టార్గెట్ చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే ఆ చానల్ ప్రచారాలు ఏపీలో రాకుండా వైసీపీ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల ద్వారా అడ్డుకుంది.దీనిపై పీకలదాకా కోపం పెంచుకున్న రాధాకృష్ణ వైసిపి దూకుడుకు అడ్డుకట్ట వేయడంతోపాటు తెలుగుదేశం పార్టీ కి తిరిగి పునర్వైభవం తీసుకురావాలంటే కేంద్ర అధికార పార్టీ బిజెపి మద్దతు ఉండాల్సిందే అన్న అభిప్రాయానికి వచ్చాడట.దానికోసం ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్టు సమాచారం.
తిరిగి ఏపీలో బిజెపి, టిడిపి బంధం ఏర్పడేందుకు రాధాకృష్ణ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది.అయితే రాధాకృష్ణ చెప్పిన సలహాలు సూచనలు బీజేపీ పెద్దలు పట్టించుకుంటారా అనేది సందేహంగానే ఉంది.
ఎందుకంటే ఏపీలో టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించాలని చూస్తోంది.అంతే కాదు ఇటీవలే జగన్ ప్రధాన మంత్రితో సుదీర్ఘంగా చర్చించిన నేపథ్యంలో రాధాకృష్ణ సలహాలు బీజేపీ పట్టించుకునే అవకాశమే ఉండదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.