కబడ్డీ ప్రియులను ఎంతగానో అలరించి ప్రొ కబడ్డీ 9వ సీజన్ శనివారం ముగిసింది.ఫైనల్ మ్యాచ్ పుణెరి పల్టాన్ – జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగింది.
చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 33-29తో విజయం సాధించింది.పుణెరి పల్టాన్ ఆరంభం బాగానే ఉంది.
చక్కగానే పాయింట్లు సంపాదించారు.అయితే మ్యాచ్లో అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయత్ వంటి ప్రధాన రైడర్లు లేకపోవడం ఆ జట్టును దెబ్బ తీసింది.
దీంతో రైడింగ్లో అనుకున్నంతగా ఈ జట్టు రాణించకపోవడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బ తీసింది.ఇక ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన జైపూర్ జట్టు టైటిల్ ఎగరేసుకుపోయింది.
జైపూర్ పింక్ పాంథర్స్ మొత్తం మ్యాచ్లో నిలకడైన ప్రదర్శన కనబర్చింది.అందులో కెప్టెన్ సునీల్ కుమార్ కీలక పాత్ర పోషించాడు.ప్రొ కబడ్డీలో జైపూర్ పింక్ పాంథర్స్ రెండో విజేతగా నిలిచింది.జైపూర్ జట్టు విజయంలో కెప్టెన్ సునీల్ కుమార్తో పాటు స్టార్ రైడర్ అర్జున్ దేశ్వాల్ అద్భుతంగా రాణించాడు.
ఈ ఇద్దరూ 6 చొప్పున పాయింట్లు సాధించారు.మొత్తంగా ప్రొ కబడ్డీ లీగ్లో రెండవ సారి జైపూర్ జట్టు విజేతగా నిలిచింది.
దీంతో ఈ జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ ఆనందానికి అవధులు లేవు.
అతడితో పాటు భార్య ఐశ్వర్యా రాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ వచ్చారు.మ్యాచ్లో గెలిచాక వారు గంతులు వేశారు.పట్టరాని సంతోషంతో స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు.
విశేషం ఏమిటంటే, ఎనిమిదేళ్ల తర్వాత జైపూర్ మరోసారి విజయం సాధించడంతో వారి ఆనందం రెట్టింపు అయింది.అంతకు ముందు 2014లో జైపూర్ పింక్ పాంథర్స్ తొలి ప్రొ కబడ్డీ కప్ను గెలుచుకుంది.
తన సంతోషాన్ని జట్టు యజమాని అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.అలాగే ఐశ్వర్య, ఆరాధ్య ట్రోఫీని పట్టుకుని ఉన్న ఫోటోను కూడా అభిషేక్ పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతూ పాపులర్ అయ్యాయి.