ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది.
ఈ పథకం అమలు ద్వారా పేదలు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఎన్నో రోగాలకు చికిత్స చేయించుకోవచ్చు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలవుతోంది.
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేయించుకున్న వాళ్లకు చికిత్స చేయించున్నన్ని రోజులకు నగదు కూడా ఇస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు.అయితే తెలంగాణ రాష్ట్రంలోని నిమ్స్ ఆస్పత్రి మాత్రం ఆరోగ్య శ్రీ రోగులకు ఝలక్ ఇచ్చింది.ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం వచ్చిన రోగులు 25 శాతం ఖర్చులను భరించాల్సిందేనని పేర్కొంది.
నిన్నటి నుంచి నూతన నిబంధన ఆస్పత్రిలో అమలులోకి వచ్చింది.ఇప్పటివరకు 2,000 రూపాయల వరకు ఓపీ సేవల్లో కోత విధించగా ఆస్పత్రి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం రాయితీల్లో కోత విధించింది.నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా, లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రికి భారీగా నష్టాలు రావడం, ఆదాయం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.ఆస్పత్రి పరిస్థితిని చక్కదిద్దాలనే ఉద్దేశంలో భాగంగా రాయితీల్లో కోత విధించామని తెలిపారు.
గతంలో నెలకు 8 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం చేకూరగా ప్రస్తుతం ఆ ఆదాయం రెండున్నర కోట్ల రూపాయలుగా ఉందని.క్యాష్ కలెక్షన్లు తగ్గడం వల్లే ఆస్పత్రిలో ఈ పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు.