అమెరికాలో భారత సంతతి వైద్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అమెరికాతో పాటు భారత్లో ప్రజలకు నేనున్నానంటూ చేయూతనందించింది.
భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో భారీ విరాళాలు సేకరించి మందులు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను ఇండియాకు పంపారు ఈ సంస్థ నిర్వాహకులు.అలాగే టెలి మెడిసిన్ సేవల ద్వారా కరోనా రోగులకు వైద్య సాయాన్ని అందించి వారిలో ధైర్యాన్ని నింపింది.
తాజాగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఏఏపీఐ పలు సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.దీనిలో భాగంగా మెగా రక్తదాన శిబిరానికి శ్రీకారం చుట్టింది.
ఆగస్టు 15 నుంచి అమెరికాలోని 75 నగరాల్లో నెల రోజుల పాటు స్టెమ్ సెల్ డ్రైవ్తో పాటు రక్తదాన కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపింది.ఈ మేరకు ఏఏపీఐ అధ్యక్షురాలు అనుపమ గొట్టిముక్కల ప్రకటించారు.
ఏఏపీఐ నూతన అధ్యక్షురాలిగా అనుపమ కార్యనిర్వాహక బృందం జూలై 4న అట్లాంటాలో జరిగిన ఏఏపీఐ కన్వెన్షన్లో బాధ్యతలు చేపట్టారు.కరోనా విలయతాండవం నేపథ్యంలో రక్త సేకరణ, ఫ్రీ యాంటీబాడీ టెస్ట్ వంటివి కీలకమైనవిగా ఏఏపీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు చాలా తక్కువగా వున్నాయని.ఇదే సమయంలో దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని అనుపమ గొట్టిముక్కల అన్నారు.
ఈ కారణాల నేపథ్యంలో ఏఏపీఐని ప్రీమియం హెల్త్ కేర్ లీడర్గా తీర్చిదిద్దుతానని అనుపమ ప్రతిజ్ఞ చేశారు.
అమెరికాలోని అతిపెద్ద ప్రవాస సంస్థ అయిన ఏఏపీఐలో దాదాపు 1,00,000 మందికి వైద్యులు సభ్యులుగా వున్నారు.బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఆగస్టు 7న చికాగోలో ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి ఛైర్మన్గా వ్యవహరిస్తున్న మెహర్ మెదవ్రామ్ తెలిపారు.ఆసక్తి వున్న వారి నగరంలో రక్త దాన శిబిరంలో పాల్గొనవచ్చని ఏఏపీఐ మేనేజర్ విజయ కొడాలి పేర్కొన్నారు.