సాధారణంగా విమానాలు అంటే విలాసవంతమైన ప్రయాణానికి పెట్టింది పేరు పరిశుభ్రమైన వాతావరణంలో, హాయిగా గమ్య స్థానానికి చేరుకోవచ్చు.రైళ్లు, బస్సులు మిగిలిన రవాణా సాధానాల్లో లాగా అక్కడ చెత్త ఉండటం కానీ, విష సర్పాలు సంచరించడం గాని జరగదు.
అయితే అమెరికాలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళను తేలు కుట్టడం కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం ఓ మహిళ యూనైటెడ్ ఎయిర్లైన్స్లో శాన్ఫ్రాన్సిస్కో నుంచి అట్లాంటా వెళుతోంది.
ఈ క్రమంలో ఆమె కాలికి ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపించింది.వెంటనే టాయ్లెట్కు వెళ్లిన ఆమెకు ఫ్యాంటులోంచి తేలు కిందపడటం కనిపించింది.
దీనిపై భయాందోళనకు గురైన ఆమె వెంటనే విమానంలోని సిబ్బందికి విషయం చెప్పింది.
దీంతో వారు ఎయిర్పోర్టులోని వైద్యుడిని సంప్రదించి ప్రథమ చికిత్సను అందించారు.ఫ్లైట్ అట్లాంటాలో ల్యాండ్ అయిన వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు యూనైటెడ్ ఎయిర్లైన్స్ తెలిపింది.ఇందుకు సంబంధించిన కథనాన్ని సెలబ్రిటి వెబ్సైట్ టీఎమ్జెడ్ ప్రచురించడంతో అమెరికాలో సంచలనం సృష్టించింది.
విమానంలో ప్రయాణికుడిని తేలు కుట్టిన ఘటనలు గతంలోనూ జరిగాయి.ఈ ఏడాది ఆరంభంలో ఇండోనేషియాకు చెందిన లయన్ ఎయిర్లైన్స్లో లగేజ్ రాక్పై తేలు కనిపించింది.2017లో యూనైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో కెనడాకు చెందిన ఓ వ్యక్తిని తేలు కుట్టింది.ఇందుకుగాను సదరు విమానయాన సంస్ధ అతనికి నష్టపరిహారాన్ని సైతం చెల్లించింది.