కరోనాతో దెబ్బతిన్న దేశాలకు అమెరికా నుంచి ఆర్ధిక సాయం, వ్యాక్సిన్లు, మందులు వంటి అత్యవసర సాయం అందజేయాలని కోరుతూ అక్కడి చట్టసభ సభ్యులు ప్రయత్నిస్తూనే వున్నారు.దీనిపై భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఓ అంతర్జాతీయ వెబినార్లో మాట్లాడుతూ.
కరోనాతో అల్లాడుతున్న దేశాలకు 20 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించాలని తాము ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టామన్నారు.వేరియంట్స్ టూ ఇన్ఫెక్ట్ అండ్ డిసిమేట్ (నోవిడ్) చట్టం ప్రకారం.
బైడెన్ యంత్రాంగం 80 మిలియన్ల అదనపు వ్యాక్సిన్ డోసులను అభివృద్ధి చెందుతున్న, అల్పాదాయ దేశాలకు అందిస్తామన్నారు.ప్రపంచంలోని 60 శాతం జనాభాకు వ్యాక్సిన్ వేయించుకునేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందిస్తోందని కృష్ణమూర్తి వెల్లడించారు.
‘‘ Strategies for Dealing with Pandemic for Equitable Access to Vaccines’’ పేరుతో … గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయం, హోవార్డ్ విశ్వవిద్యాలయం, భారత విశ్వవిద్యాలయాల సంఘం, హర్యానా ఉన్నత విద్యా మండలి, కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, స్వదేశీ స్వాలాంబన్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ వెబ్నార్ను నిర్వహించాయి.ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ రాన్ సోమర్స్ మాట్లాడుతూ.“హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి లకు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంలో భారత్, అమెరికాలు కీలకపాత్ర పోషించాయని గుర్తుచేశారు.భారత్లో ఏడుగురు వ్యాక్సిన్-తయారీదారులు ఉన్నారని, వీరికి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయితే కోవిడ్ వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేయవచ్చని సోమర్స్ అభిప్రాయపడ్డారు.
మాజీ రాయబారి, ప్రముఖ రచయిత ప్రొఫెసర్ ప్రదీప్ కపూర్ మాట్లాడుతూ.కరోనాను ఎదుర్కోవటానికి ప్రపంచంలోని ఎంత శక్తివంతమైన ప్రభుత్వమైనా ఒంటరిగా ఏం చేయలేదన్నారు.పౌర సమాజంతో కమ్యూనికేట్ చేయగల నాయకులు మాత్రమే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొగలరని ప్రదీప్ అన్నారు.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ సభ్యుడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ మందులు, పరికరాల కోసం అంతర్జాతీయ సహాయం అందించేందుకు వున్న అడ్డంకులను పరిష్కరించాలని కోరారు.
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ పంకజ్ మిట్టల్ మాట్లాడుతూ.
కోవిడ్ నుండి మానవాళిని కాపాడేది వ్యాక్సిన్ మాత్రమేనన్నారు.టీకాలను ఉచితంగా ఎలా పొందాలనే దానిపై మనమంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
స్వదేశీ జాగరణ్ మంచ్ అఖిల భారత సహ-నిర్వాహకుడు, ప్రముఖ ఆర్థికవేత్త సతీష్ కుమార్ మాట్లాడుతూ.పేటెంట్ హక్కుల చట్రబంధం నుంచి కరోనా వ్యాక్సిన్ విముక్తి పొందాలని సూచించారు.ఇందుకు సంబంధించి తాము వేసిన పిటిషన్లో ఇప్పటికే 3 లక్షల మంది సంతకం చేశారని తెలిపారు.1,500 మంది వైస్-ఛాన్సలర్లు, మేధావులు, శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు కూడా ఇలాంటి మరో పిటిషన్పై సంతకం చేశారని సతీష్ కుమార్ పేర్కొన్నారు.