ఓ పూరి గుడిసె ముందు నిలబడి ఆ ఊరి ఆసామి కోటయ్య….ఏవమ్మా ? లచ్చమ్మ నా అప్పు తీరుస్తావా లేదా? ఎన్ని రోజులాగాలి? ఇచ్చి యేడాది కావొస్తుంది.ఇది లాస్ట్ గడువు ఇవ్వకపోతే బాగుండదు చెబుతున్నా అంటూ సింహంలా గర్జించాడు .అతనికి ఇవ్వాల్సింది అయిదు వేల రూపాయలు, అది కూడా భర్త అనారోగ్యంగా ఉన్నప్పుడు బతుకుతాడనే ఆశతో ఆసుపత్రికి పెట్టిన ఖర్చు, కానీ భర్త బతకలేదు.అప్పు మాత్రం అలాగే మిగిలింది.
రోజూ కష్టపడ్డ సొమ్ము తిండికి,బట్టకే చాలట్లేదు.
ఇక అప్పు తీర్చేదెక్కడ.ఆ ఆసామి మాటలు , ఆ ఆరవ తరగతి పిల్లాడు అరుణ్ పై బలంగా పడ్డాయ్.
ఈ కోటయ్య అప్పు ఎలాగైనా తీర్చేయాలని ఫిక్స్ అయ్యాడు.రెండు జతల బట్టలు ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకొని సడీసప్పుడు కాకుండా ఒక రోజు సాయంత్రం ఆ ఊరినుండి పట్నం బయలు దేరుతున్న గ్యాంగ్ తో కలిసాడు.
దాదాపు 7 గురు లారీ ఆపి, ఎక్కి, హైద్రాబాద్ లో దిగారు.
LB నగర్ లోని ఓ కాలనీ వారు అయిదవ రోజు కావడంతో వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళుతున్నారు.డప్పు సౌండ్ కు తీన్మార్ దరువులకు ఆ కాలనీ యూత్ అంతా డాన్స్ చేసుకుంటూ… ఆ బ్యాండ్ గ్యాంగ్ లో అరుణ్ కూడా ఉన్నాడు.ఓ స్టీల్ పరికరాన్ని నడుముకు చుట్టుకొని రెండు ప్లాస్టిక్ కర్రలతో డ్రమ్ కు తగ్గట్టు తను కూడా వాయిస్తున్నాడు.
ఇలా వినాయకుడిని నిమజ్జనం చేసే ప్రతి రోజూ ఏదో ఒక చోట డప్పు కొట్టుకుంటూ వాళ్లిచ్చే డబ్బును జాగ్రత్తగా దాచుకునే వాడు అరుణ్, పుట్ పాత్ మీద పడుకునేవాడు.ఉదయం స్టార్ట్ అయితే నైట్ వరకు అదేపనిగా డప్పు కొటేవాడు కావడంతో నైట్ నిద్రలో కూడా డప్పు కొడుతున్నట్టు చేతులు ఊపేవాడు.
తొమ్మిదో రోజైతే క్షణం తీరిక లేకుండా గడిపాడు డప్పు కొట్టుకుంటూ.
నిమజ్జనం కార్యక్రమం, డప్పు కొట్టే పని కూడా అయిపోవడంతో గ్రూప్ తో పాటు ఇంటికొచ్చాడు అరుణ్.
వినాయకుడి పేరు మీద తాను సంపాదించిన డబ్బుతో కొన్న కొత్త చీరను, కర్చీఫ్ లో పొట్లం కట్టిన మిగిలిన సొమ్మును అమ్మ చేతిలో పెట్టి ….తీర్చు కోటయ్య గాడి అప్పు ….
అని గతంలో కోటయ్య చేసిన గర్జన కంటే డబుల్ సౌండ్ తో అన్నాడు అరుణ్.