ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెంపుడు కుక్కలకు, పందులకు లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి చేసింది జగన్ సర్కార్.ఇందుకోసం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ జీవో నెంబరు 693 ను జారీ చేసింది.
యజమానులు తమ కుక్కలకు, పందులకు తప్పనిసరి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.లేనిచో రూ.500 జరిమానా కట్టాలి.అలాగే రూ.250 అపరాధ రుసుము చెల్లించాలి.అధికారులు చెకింగ్ కి వచ్చినప్పుడు పందులు, కుక్కలకు సంబంధించిన లైసెన్స్ చూపించాల్సి ఉంటుంది.
ఒకవేళ లైసెన్స్ లేని పందులను, కుక్కలను తమ వాటిగా యజమానులు నిర్ధారించ లేనియెడల వాటిని వీధి కుక్కలుగా, పందులు గా పరిగణించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని జీవో లో పేర్కొంది.
అలాగే కుక్కలు, పందుల లైసెన్స్ గడువు ముగిసిన పది రోజుల్లోనే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
యజమానులు తమ పెంపుడు కుక్కల విషయంలో హెల్త్ సర్టిఫికెట్ తప్పకుండా తీసుకోవాలి.ఎవరైతే పందులను పెంచుతున్నారో వారు తమ పందులకు గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి యొక్క గ్రామపంచాయతీలో యజమానులకు టోకెన్లు ఇవ్వనున్నది.అయితే ఈ టోకెన్లను యజమానులు తమ పెంపుడు జంతువుల మెడలో వేయాల్సి ఉంటుంది.
ఎప్పుడో జంతువుల మెడలో టోకెన్ల కార్డు లేనిచో అధికారులు జరిమానా విధిస్తారు.

ప్రతి గ్రామంలో పెంపుడు కుక్కలు, పందుల పై పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త కమిటీని వేయనుందని జీవో లో పేర్కొన్నట్టు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ వెల్లడించారు.అయితే ఈ కొత్త కమిటీకి గ్రామ సర్పంచ్ చైర్మన్ గా, పంచాయతీ సెక్రటరీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు.ఈ కమిటీ గ్రామ పంచాయతీల్లో పెంపుడు కుక్కలు, పందుల సంఖ్య, వాటి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.
ఇకపోతే వీధి కుక్కలు, పందులను గుర్తించి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తారు.అలాగే వాటికి టీకాలు వేసి వాటిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.