రాచరికాల నుంచి ప్రజాస్వామ్యం వైపు ప్రపంచం నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికీ రాజరికాల కబంద హస్తాల్లో మగ్గుతున్న ఎన్నో దేశాల ప్రజలు తమకు ప్రజాస్వామ్యం కావాలని ఉద్యమ బాట పడుతున్న సంగతి తెలిసిందే.
తరచిచూస్తే ప్రతి చోట ఇందుకు సంబంధించిన ఉద్యమాలు మీకు కనిపిస్తూనే వుంటాయి.
ప్రజాస్వామ్యం అన్నప్పుడు కనీస మానవ హక్కులైన స్వేచ్ఛ, సమానత్వం, భావ స్వాతంత్య్రం వంటి వాటికి అవకాశం ఉంటుంది.
ఓటు, ఎన్నికలు ప్రజాస్వామ్యానికి మచ్చు తునకలు.ప్రజాస్వామ్యం రాణించాలంటే వివిధ వర్గాల ప్రజలు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకోవాలి.
అప్పుడే ప్రజా సమస్యలకు మేలైన పరిష్కారాలు లభించి సమాజం పురోగతి సాధిస్తుంది.ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఓటింగ్ శాతమే పౌరుల భాగస్వామ్యానికి కొలమానం.
కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకునేవారి సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.భారతదేశ విషయానికి వస్తే.పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కంటే గ్రామీణ, స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం అధికంగా ఉంటుందట.దీనిని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం.
ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.మరికొందరు మేధావులైతే.
పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా నిర్బంధ ఓటు హక్కు విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.అంతే కాదు.
ఓటు వేయని వారికి శిక్షలు కూడా వేయాలంటున్నారు.కానీ పౌరుల బాధ్యతలను వేరొకరు గుర్తు చేయాల్సి రావడం బాధాకరమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.ఓటు హక్కు వినియోగించుకున్నందుకు అమెరికాలో వ్యక్తిని అరెస్ట్ చేశారు.అంతేకాదు అతనికి సుమారు 40 ఏళ్ల శిక్ష కూడా పడే అవకాశముందని అంటున్నారు.వివరాల్లోకి వెళితే.
టెక్సాస్కు చెందిన హెర్విస్ రోగర్స్ అనే పౌరుడు గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు.దాదాపు ఆరు గంటల పాటు క్యూలో నిల్చుని తన వంతు వచ్చే వరకు నిరీక్షించి మరి ఓటు వేశాడు.
దీంతో అతడి క్రమశిక్షణను, పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చినందుకు అందరూ మెచ్చుకున్నారు.మీడియా సైతం రోగర్స్పై విస్తృతమైన కథనాలు ప్రచురించడంతో రోగర్స్ అమెరికాలో బాగా పాపులరయ్యాడు.
అంతాబాగానే వున్నప్పటికీ.ఇటీవల అతడు వేసిన ఓటు చట్టవిరుద్ధమని పోలీసులు తేల్చారు.స్థానిక చట్టాల ప్రకారం పలు నేరాల్లో శిక్ష పడి జైలుకు వెళ్లొచ్చిన వారు ఓటు వేయడానికి అనర్హులు.ఇక్కడే అతను దొరికిపోయాడు.
దాదాపు 20 ఏళ్ల కిందట హెర్విస్ రోగర్స్ రెండు నేరాలు చేసి జైలుకెళ్లాడు.ప్రస్తుతం పెరోల్పై విడుదలయ్యాడు.
నేరారోపణలు వున్న వారు ఓటు వేయ కూడదనే విషయం తెలియక హెర్విస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడట.గత మార్చితో పాటు 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ హెర్విస్ ఓటు వేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
దీంతో రెండుసార్లు నిబంధనలకు విరుద్ధంగా ఓటు వేసిన హెర్విస్కు 40 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.