భారత క్రికెటర్లు అంటే ఇష్టపడిని వారుండరు.ప్రపంచ వ్యాప్తంగా మన క్రీడాకారులకు అభిమానులు ఉంటారు.
అందులో స్టార్ సెలెబ్రిటీలు, క్రికెటర్లు, ప్రముఖులు, రాజకీయనాయకులు ఎందరో ఉంటారు.అయితే, సాధారణ ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన క్రికెటర్ను ఒక్కసారి అయిన కలువాలని, ఒక ఫోటో దిగాలని ఎన్నో కలలు కంటుంటారు.
సరిగ్గా మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో చాలా మంది వారిని కలుసుకోవడానికి సెక్యూరిటీ కళ్లుగప్పి మైదానంలోకి అడుగుపెడ్తుంటారు.తాజాగా ఇలాంటి ఘటనే ఇండియా వర్సెస్ న్యూజీలాండ్ మ్యాచ్లో జరిగింది.
ఇండియా ప్రస్తుతం న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది.టీ 20 వరల్డ్ కప్ ముగిసిన రెండ్రోజుల్లోనే ఈ సిరీస్ ప్రారంభమైంది.మూడు టీ20 మ్యాచుల్లో భాగంగా శుక్రవారం జార్ఖండ్లోని రాంచీ JSCA ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో రెండో టీ 20 మ్యాచ్ జరిగింది.ఇందులో టీం ఇండియా ఆటగాళ్లు చెలరేగి ఆడటంతో భారత్ 7 వికెట్ల తేడాతో కివీస్పై గ్రాండ్ విక్టరీ కొట్టింది.
న్యూజిలాండ్ ఇచ్చిన 153 పరుగుల టార్గెట్ను ఇండియా సునాయసంగా ఛేదించింది.
అయితే, ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్ ఒకరు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి మిడాన్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ కాళ్లపై పడ్డాడు.వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతన్ని గ్రౌండ్ నుంచి బయటకు తీసుకువెళ్లారు.ఒక్కసారిగా ఈ పరిణామం చోటుచేసుకోవడంతో రోహిత్ శర్మ కూడా షాక్ అయ్యాడు.
కాగా, ఈ ఘటనపై మాజీ ఆటగాళ్లు సీరియస్ అయ్యారు.క్రీడాకారులకు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయని అసహనం వ్యక్తం చేశారు.అసలే ఆటగాళ్లు బయోబబుల్ లో ఆడుతున్నారని, కొవిడ్ టైంలో ఎమైనా జరిగితే ఎవరు రెస్పాంన్సిబుల్ అని మండిపడినట్టు తెలుస్తోంది.