టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.‘సేవ్ డెమోక్రసీ’ ఉద్యమంలో భాగంగా నిన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి ఢిల్లీలో ల్యాండైన జగన్… కొద్దిసేపటి క్రితం ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై తాను విడుదల చేసిన ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ బుక్కును ఆయన పవార్ కు అందజేశారు.పవార్ తో భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన జగన్ అక్కడి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అక్రమాస్తి లక్ష కోట్లు దాటేసిందని ఆరోపించారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కునేందుకు చంద్రబాబు తన అక్రమ సంపాదననే వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఇస్తున్నారని ఆరోపించారు.అంతేకాకుండా మంత్రి పదవులను కూడా ఎరవేస్తూ తమ పార్టీ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని విమర్శించారు.
ఈ విషయాలన్నింటినీ జాతీయ నేతలకు వివరిస్తామని జగన్ చెప్పారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి మళ్లీ ఎన్నికలకు రావాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు.