ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అక్టోబర్ 22న విజయదశమి రోజు శంకుస్థాపన జరిగే విషయం తెలుసు.కానీ శంకుస్థాపన చేసే ప్రాంతం ఎక్కడో ఇంకా నిర్ణయం కాలేదు.
దీనిపై సర్కారు కసరత్తు చేస్తున్నది.రాజధాని నిర్మించే ప్రాంతానికి ఎంతటి ప్రాధాన్యం ఉన్నదో శంకుస్థాపన చేసే ప్రదేశానికి కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది.
రాజధాని నిర్మాణాన్ని ఒక మంచి పనిగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి శంకుస్థాపన ఎక్కడ చేస్తారనే విషయంలో ఆసక్తి ఉంటుంది.శంకుస్థాపన జరిగిన ప్రాంతం వారు తమ ఊళ్ళో లేదా ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసారని గొప్పగా చెప్పుకుంటారు.
అయితే రాష్ట్ర విభజన తరువాత వాస్తు పిచ్చి బాగా పట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన విషయంలో వాస్తును తప్పక అనుసరిస్తారు.ఇంటి నిర్మాణానికే అన్ని కోణాల నుంచి వాస్తు చూస్తున్నప్పుడు రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు చూడరా? రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని వాస్తు ప్రకారమే ఎంపిక చేసారు.రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ఇచ్చిన సంగతి తెలుసు.ఆ మాస్టర్ ప్లాన్ మీద దేశంలోని నిర్మాణ రంగ నిపుణుల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం సేకరించింది.
వీటిని మాస్టర్ ప్లాన్ తయారు చేసిన వారికి పంపింది.ఇవి కూడా పరిశీలించిన తరువాత ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఖరారు చేస్తారు.