‘మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలి’…అంటాడు ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో రావుగోపాలరావు.మరి ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో చేరే నాయకులకు ఏదో ఒక పదవి లేకపోతే ఎట్లా? అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు పదవులు తప్పనిసరిగా కావాలి.తమ పార్టీ అధికారంలో ఉన్నాక పదవులు లేకపోతే అవమానకరంగా ఉంటుంది.మంత్రి పదవులు అందరికీ దక్కవు.మరి ఆ పదవులు దక్కనివారు ఖాళీగా ఉండాల్సిందేనా? ఉండక్కర్లేదు.నామినేటెడ్ పదవులు ఉంటాయి.
వాటిని పంచిపెడతారు.అవసరమనుకుంటే ఇంకా పదవులు సృష్టిస్తారు కూడా.
ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ నాయకులు పదవుల కోసం యమ తాపత్రయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.కేసీఆర్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నా ఇంకా చాలామంది నాయకులకు పదవులు దక్కలేదు.
కొందరు నాయకులు మంత్రి పదవుల కోసం చూస్తుంటే, అవి దక్కవని డిసైడైనవారు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.అయితే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ గురించిగాని, నామినేటెడ్ పదవుల గురించిగాని ఏమీ మాట్లాడకపోవడంతో నాయకులు అసంతృప్తిగా ఉన్నారట….! పాలన ఏడాది ముగిసిపోయింది కాబట్టి మంత్రి వర్గంలో మార్పులు చేస్తారని, విస్తరిస్తారని అనుకుంటున్నారు.రాష్ర్టంలో నాలుగువేల నామినేటెడ్ పదవులు ఉండగా ముఖ్యమంత్రి కొన్ని మాత్రమే భర్తీ చేశారట.
మిగిలినవి ఎందుకు భర్తీ చేయడంలేదని అసహనంగా ఉన్నారు.కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ అయిన కవిత కూడా ‘కేసీఆర్ మీకు మంత్రి పదవులు ఇస్తారు.బాధపడకండి’ అని నాయకురాళ్లకు చెప్పారు.సర్కారుకు గడువు ఇక నాలుగేళ్లే ఉండటంతో ప్రజాసేవ చేయడానికి సమయం తక్కువగా ఉందని టీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నారు.