ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు ప్రభుత్వం గత కొంత కాలంగా కేంద్రం వైపు ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది.రాష్ట్రం ఏర్పాటై ఏడు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రత్యేక హోదాపై ఒక స్పష్టత రాలేదు.
అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా లోక్సభలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రతిపతి కల్పిస్తామని ప్రకటించారు.రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రనికి ఏర్పడ్డ లోటును పూడ్చుతామని, అందుకోసం ప్రత్యేక హోదాను ఇస్తామంటూ ప్రధాని ప్రకటించాడు.
అయితే ఆయన ప్రకటనకు ఇప్పుడు విలువ లేకుండా పోయింది.నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి చర్చిస్తున్నట్లుగా చెప్పుకొచ్చిన కేంద్ర మంత్రులు తాజాగా ఆ విషయం గురించి మర్చి పోవాలని ఏపీ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయం గురించి తెలుగు దేశం ఎంపీ మురళి మోహన్ స్పందిస్తూ… ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై వస్తున్న వార్తలు నిజమే అని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అన్ని రాష్ట్రాలు కూడా అంగీకారం తెలపాల్సి ఉందని, అలా జరగడం కష్టమని చెప్పుకొచ్చాడు.ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా కేంద్రం పరోక్షంగా రాష్ట్రానికి ఏదైనా సాయం చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు.
ఇటీవలే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు ప్రకటించిన విషయం తెల్సిందే.కేంద్రం ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం నీరుగారి పోయింది.
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎంతో మంచి జరుగుతుందని భావించిన ప్రజలకు ఈ విషయం మింగుడు పడటం లేదు.