ఖమ్మం జిల్లాలో టిఎస్ పి ఎస్ సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు.మొత్తం అభ్యర్థులు 17365 కు గాను, 10945 మంది (63.03%) హాజరైనట్లు, 6420 మంది (36.97%) గైర్హాజరు అయినట్లు ఆయన అన్నారు.ఆదివారం జిల్లాలో జరిగిన గ్రూప్-1 ప్రిలీమినరి పరీక్ష కేంద్రాలను ఉదయం కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల, ఆర్జేసి డిగ్రీ కళాశాల, రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
పరీక్ష నిర్వహణ ప్రక్రియను ఆయన పరిశీలించారు.పరీక్షా కేంద్రాలను పరిశీలించి అభ్యర్థులు పరీక్షను రాస్తున్న విధానాన్ని పరిశీలించారు.అధికారులకు సూచనలు చేశారు.
అభ్యర్థులతో పాటు, ఇన్విజిలేటర్లు, పరీక్ష నిర్వహణ సిబ్బంది అందరిని తనిఖీలు చేయాలని, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించవద్దని తెలిపారు.
ప్రవేశ మార్గం మరొకటి ఉన్న చోట, కిటికీల వద్ద గట్టి నిఘా పెట్టాలన్నారు.ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ తనిఖీల సందర్భంగా శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఏసీపీ రామోజీ రమేష్, ప్రిన్సిపాళ్లు డా.జి.పద్మావతి, బి.అరుణ్ కుమార్, అధికారులు తదితరులు ఉన్నారు.