దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ఒకవైపు ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.
రెండో సభను ఏపీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఏపీ తరువాత కానీ, ముందు కానీ మహారాష్ట్రలోని నాందేడ్ లో సభ నిర్వహించేందుకు ఒక పక్క అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇంత జరుగుతున్నా, ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా కనిపిస్తోంది .సంక్రాంతి తర్వాత ఏపీలో భారీగా చేరికలు ఉంటాయని , మీకు తీరికే ఉండదంటూ ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ను ఉద్దేశించి కేసిఆర్ ఖమ్మం సభ వద్ద వ్యాఖ్యానించారు.అయితే సంక్రాంతి వెళ్లి పది రోజులు దాటుతున్నా, ఏపీలో బీఆర్ఎస్ లో చేరికలు మాత్రం కనిపించడం లేదు.
మొదట్లో కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు చేరినా, వారిలో క్షేత్రస్థాయిలో బలం ఉన్న నాయకులు లేరు.ఆర్థిక బలం , సామాజిక వర్గం లెక్కలు వేసుకుని కొంత మంది నేతలను చేర్చుకున్నట్టుగా కనిపిస్తున్నారు.కానీ ఇతర పార్టీలలోని నేతలు ఎవరు బీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా కనిపించడం లేదు.
ఇక పార్టీ తరఫున పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు చేయడం లేదు.ఇప్పటికే బీఆర్ఎస్ వైసిపికి అనుకూలంగా ఏపీలో ఏర్పాటు అవుతుందని, ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి జగన్ కు మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.
దీంతో ఈ వ్యవహారం పైన అనుమానాలు కలుగుతున్నాయి .ఇది ఇలా ఉంటే, ఈనెల 28వ తేదీన అంటే రేపు విశాఖపట్నం లో సీఎం జగన్ తో పాటు, కేసీఆర్ రాబోతున్నారు. శారదాపీఠంలో జరిగే కార్యక్రమంలో ఇద్దరు పాల్గొనబోతున్నారు.
అయితే ఈ ఇద్దరు ఒకేసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేక ఒకరు వచ్చి వెళ్లిన తరువాత మరొకరు వస్తారా అనేది క్లారిటీ లేదు.ఒకవేళ ఇద్దరు కలిసే ఈ కార్యక్రమంలో పాల్గొంటే, ప్రతిపక్షాలు చేసే విమర్శలకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుంది.ఇక బీఆర్ఎస్ లో చేరికలు ఇప్పుడు పెద్దగా లేకపోయినా, విశాఖలో నిర్వహించబోయే బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ తరువాత ఈ చేరికలు భారీగా ఉంటాయని, ఏపీలో బలమైన శక్తిగా బీఆర్ఎస్ ఏర్పడుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
అంతేకాదు ఇతర పార్టీలోని కీలక నాయకులతో ఇప్పటికే తమ అధినేత కేసిఆర్ చర్చలు జరుపుతున్నారని, తొందరలోనే కీలక నాయకులంతా తమ పార్టీలో భారీగా వచ్చి చేరుతారని బీఆర్ఎస్ ఏపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.