నల్గొండ జిల్లా:కాకతీయ సామ్రాజ్యపు వీరవనిత రాణి రుద్రమదేవి 733వ,వర్ధంతి వేడుకలు నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని రాణి రుద్రమదేవి మరణ శిలాశాసనం వద్ద వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తంగెడ కిషన్ రావు,పరిశోధకులు సూర్య కుమార్ హాజరై శిలా శాసనం దగ్గర రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాులర్పించారు.
ఈసందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్య పాలనలో ప్రజలు చాలా సుఖసంతోషాలతో ఉండేవారని,ముందు చూపుతో గొలుసుకట్టు చెరువులను త్రవ్వించి ప్రజలకు సాగునీరు,త్రాగునీరు అందించి కాకతీయ సామ్రాజ్యం శస్యశ్యామలంగా కొనసాగే విధంగా కాకతీయులు పాలించారని కొనియాడారు.అంతంటి గొప్ప చరిత్ర కలిగిన రాణి రుద్రమదేవి ఈ ప్రాంతంలో మరణించినట్టుగా ఇక్కడ శిలాశాసనం తెలియపరుస్తుందన్నారు.
ఆమె వర్ధంతి రోజున ఇక్కడికి విచ్చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని,ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంత గొప్పగా నిర్వహిస్తూ వస్తున్న వివేకానంద యువజన మండలి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.