టిడిపి అధినేత చంద్రబాబుకు కంటిలో నలుసులా మారారు గుడివాడ ఎమ్మెల్యే , మాజీమంత్రి కొడాలి నాని. రాజకీయంగాను చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని తరచుగా కొడాలి నాని విమర్శలు చేస్తూ ఉంటారు.
వ్యక్తిగతంగాను దూషణలకు దిగుతూ చంద్రబాబు పరుపతిని తగ్గించే ప్రయత్నం నాని చేస్తుండడం వంటివి చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నా, నాని నీ కట్టడి ఏ విధంగా చేయాలనే విషయంలో చాలా కాలంగా ఆయన తర్జనభజన పడుతున్నారు.అసలు గుడివాడలో కొడాలి నాని గెలవకుండా చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా, ఆయన విజయాన్ని ఆపలేకపోయారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలిచారు .2024 ఎన్నికల్లో కచ్చితంగా నానిని ఓడించి, ఆయన తిట్ల నుంచి విముక్తి పొందాలని బాబు ప్రయత్నిస్తున్నారు.అందుకే నానిని ఓడించి టిడిపి తరఫున గెలవగలిగిన బలమైన అభ్యర్థి కోసం బాబు వెతుకులాట మొదలుపెట్టారు .2019 ఎన్నికల్లో నానిని కచ్చితంగా ఓడించాలని పట్టుదలతో, ఆ నియోజకవర్గంలో సీనియర్ నేతగా ఉన్న రావి వెంకటేశ్వరావును పక్కనపెట్టి మరి విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ కు గుడివాడ టికెట్ ఇచ్చారు.భారీగానే సొమ్ములు ఖర్చుపెట్టినా, అక్కడ ఫలితం లేకుండా పోయింది.మళ్ళీ నానినే విజయం సాధించడంతో పాటు మంత్రి అయ్యారు తమ పార్టీని, కుమారుడు లోకేష్ ను ఇలా అందరిని వ్యక్తిగతంగా దూషిస్తూ నాని దూకుడుగా వ్యవహరిస్తూనే వస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో కొత్త వ్యక్తిని పోటీలోకి దించితే ఫలితం అనుకూలంగా ఉంటుందని బాబు భావిస్తున్నారట.ఈ నేపథ్యంలో అమెరికాలోని అట్లాంటా లో స్థిరపడిన వెనిగండ్ల రాము అనే వ్యక్తిని గుడివాడ టిడిపి అభ్యర్థిగా ప్రకటిస్తే ఫలితం అనుకూలంగా ఉంటుందనే అంచనాలో బాబు ఉన్నట్లు సమాచారం.ఈ మేరకు రాముకు టికెట్ హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా, ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు.
ఈ కాంబినేషన్ తమకు కలిసి వస్తుందని, అటు కమ్మ, ఇటు ఎస్సీ ,ఎస్టీ వర్గాల ఆదరణ ఉంటుందని, అలాగే రాము భార్య తండ్రి గుడివాడ ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న పాస్టర్ కావడంతో ఆ సమీకరణాలన్ని కలిసి వస్తాయని, కచ్చితంగా నానిని ఓడించేందుకు అవకాశం ఏర్పడుతుందని బాబు భావిస్తున్నారట.