ఫ్యామిలీ గొడవలతో కొందరు, ఆర్ధిక ఇబ్బందులతో మరికొందరు, పరీక్షల్లో ఫెయిల్.ప్రేమలో ఫెయిల్.
వరకట్న వేధింపులు.ఇలా కారణాలు ఏమైనప్పటికీ మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది.
ప్రతి 40 సెకన్లకు ఒకరు… ప్రపంచంలో ఏదో ఒక చోట ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.ప్రభుత్వం, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా అవగాహన కలిగిస్తున్నా బలవన్మరణాలు ఆగడం లేదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏటా సగటున 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారట.15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సున్న వారి మరణాలకు రోడ్డు ప్రమాదాల తర్వాత రెండో ప్రధాన కారణం సూసైడ్.మరణాల శాతం కూడా ఒక్కో దేశంలో ఒక్కోలా వుందట.
తాజాగా అమెరికాలో దాదాపు రెండేళ్ల తర్వాత ఆత్మహత్య రేటు పెరిగింది.
బాధితుల్లో బాలురు, పురుషులే అధికంగా వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.2020లో 46,000 మంది ఆత్మహత్య చేసుకుంటే.అది 2021 నాటికి 47,650కి పెరిగింది.
ప్రతి లక్ష మంది వ్యక్తుల్లో ఆత్మహత్య శాతాన్ని పరిశీలిస్తే.అది 2020లో 13.5 శాతంగా వుండగా గతేడాది 14కి పెరిగింది.15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న యువకులు, పురుషులలోనే బలవన్మరణాల రేటు (8 శాతం) ఎక్కువ వుందని సీడీసీ తెలిపింది.
1990వ దశకంలో అమెరికాలో ఆత్మహత్యల నివారణ కోసం చెప్పుకోదగ్గ చర్యలు తీసుకున్నారు.ఆ సమయంలో బలవన్మరణాల ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడే ఔషదాలు ప్రవేశించాయని అమెరికన్ ఫౌండేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్కు చెందిన జిల్ హర్కవీ ఫ్రైడ్మాన్ తెలిపారు.అయితే కోవిడ్ 19 మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా అమెరికాలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య బాగా తగ్గింది.2021 నుంచి గణాంకాలను పరిశీలిస్తే పురుషుల ఆత్మహత్య రేటు మహిళలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువగా వుంది.పురుషులు ప్రాణాంతకమైన మార్గాలను ఎక్కువగా అవలంభించడంతో పాటు మానసిక సమస్యల విషయంలో వేరొకరి సాయన్ని కోరడం తక్కువగా వుండటమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు.