సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను బయటపెడుతూ ప్రతిపక్ష కాంగ్రేస్ పార్టీ కౌన్సిలర్లు శనివారం కార్యాలయం ముందు చెవిలో పువ్వులు ధరించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాలు సజావుగా సాగితే ప్రతి వార్డు కౌన్సిలర్ కి రూ.30 లక్షల వార్డు అభివృద్ధికి ఖర్చు చేసే అవకాశం ఉందని,కానీ, మున్సిపల్ సమావేశాలు జరపకుండా ప్రతిపక్ష కౌన్సిలర్లను వేధిస్తున్నారని ఆరోపించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కేటాయించిన నిధులు నేటికి సుమారు రూ.6 కోట్ల 73 లక్షల నిధులు నిల్వ ఉన్నాయన్నారు.కౌన్సిల్ సమావేశాలు జరిగితే 28 వార్డుల్లో అభివృద్ధి కొరకు కేటాయించాల్సిన బాధ్యత కౌన్సిల్కి ఉంటుందన్నారు.
ప్రస్తుతం హుజూర్ నగర్ చైర్ పర్సన్ మరియు అధికారులు కలెక్టర్ నుండి ఎమర్జెన్సీ పనుల పేరుతో ఎటువంటి తీర్మానాలు లేకుండా,ఎంబీ రికార్డ్ చేయకుండా గత మూడేళ్ళుగా కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.ఇప్పటికైనా మున్సిపాలిటీలో నిధులు దుర్వినియోగం కాకుండా అధికారులు కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసి,కౌన్సిల్ తీర్మానాలతో వార్డుల అభివృద్ధి కొరకు నిధులను కేటాయించాల్సిందిగా డిమాండ్ చేశారు.
హుజూర్ నగర్ అభివృద్ధి కోసం తాము చేసే పోరాటానికి ప్రజలు కూడా మద్దతు తెలిపాలని విజ్ఞప్తి చేశారు.మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసే వరకు సోమవారం నుండి తమ కార్యాచరణ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 23 వార్డ్ కౌన్సిలర్ జక్కుల వీరయ్య,కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంపత్ రెడ్డి,రాజా నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ వెంకటేశ్వర్లు,సరిత వీరారెడ్డి,వేముల వరలక్ష్మి నాగరాజు పాల్గొన్నారు.