తనను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించినా, టిఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసిఆర్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. మంత్రులు , ఎమ్మెల్యేలను విమర్శిస్తూ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడం స్పీకర్ చర్యలు తీసుకునే విధంగా పరిస్థితులు ఏర్పడినా షర్మిల మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు.
అంతకంటే రెట్టింపు స్థాయిలో ఇప్పుడు తన విమర్శలకు పదును పెట్టారు. తాజాగా కేసీఆర్ ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో షర్మిల విరుచుకుపడ్డారు.
సీఎం కేసీఆర్ గజదొంగ అంటూ మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసారని, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు , బీర్లు బీర్ల తెలంగాణ గా మార్చారు అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.
కెసిఆర్ మాటల పాలన, మభ్యపెట్టే పాలనను అంతమందించేందుకు ప్రజలంతా ఏకం కావాలని షర్మిల పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కొత్త హామీలతో మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారని, రాష్ట్రాన్ని సరిగా పాలించలేని కేసీఆర్ కు ఢిల్లీ రాజకీయాలు అవసరమా అంటూ షర్మిల ప్రశ్నించారు.
మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని తాను ప్రశ్నించినందుకు తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారని , ఈ విషయంపై మాట్లాడే దమ్ముంటే తనను అసెంబ్లీకి పిలవాలని షర్మిల సవాల్ విసిరారు .సమయం మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అసెంబ్లీ లోపలికి రావాలా అసెంబ్లీ ముందుకు రావాలా అందరి ముందు మాట్లాడదామా అంటూ షర్మిల టిఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు.ఏ ఊరికి వెళ్ళినా, ఎవరిని కలిసిన వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని షర్మిల అన్నారు.
తాము అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని , అయితే దానిని పట్టించుకోవడంలేదని, ముస్లింలు పేదరికంలో ఉన్నారని ఆలోచించి వారి కోసం నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కే దక్కుతుందని షర్మిల వ్యాఖ్యానించారు.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.