సూర్యాపేట జిల్లా:నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండిపడి నేటికి 12రోజులు గడుస్తున్నా మరమ్మతులు పూర్తి కాకపోవడంతో సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.గండి పూడిక పనులు జరుగుతున్న తీరును చూస్తే ఇంకా పది రోజులైనా పూర్తయ్యే అవకాశం కనిపించక పోవడంతో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 11 లక్షల ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని, దానివల్ల ఆయకట్ట రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని సాగర్ ఆయకట్టు పరిరక్షణ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం హుజూర్ నగర్ మండల పరిధిలోని నీళ్లులేక ఎండిపోతున్న పంట పొలాలను కమిటీ సభ్యులు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని,ఏ రైతును కదిలించినా కంటినీరే తప్ప చుక్క నీరు కనబడటం లేదని వాపోయారు.
కొత్త వెంకటేశ్వర్లు అనే రైతు ఎండిపోతున్న పైరును పట్టుకొని,పొలంలో తల పట్టుకొని నాటు పెట్టిన రోజే గండి పడిందని,వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టానని విలపిస్తున దృశ్యం కన్నీళ్లు తెప్పించాయని అన్నారు.ఎడమ కాలువకు గండిపడి 12 రోజులు గడుస్తున్నా అధికారులు,ప్రజాప్రతినిధులు జిల్లా మంత్రి కనీసం పనులను పర్యవేక్షించకపోవడం దారుణమని అన్నారు.11 లక్షల ఎకరాల ఆయకట్టు,ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో మూడు లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోతుంటే,మంత్రి,ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 17 గురించి రెచ్చగొట్టుకుంటున్నారని,రైతుల ప్రయోజనాల కంటే ఉన్మాదాన్ని రెచ్చగొట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు పడితే నీటిని వదలడానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడెందుకు రావడం లేదని ప్రశ్నించారు.
ప్రమాదాలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించి పనులను పూర్తి చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారని,రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా మంత్రి ప్రత్యక్షంగా తన పర్యవేక్షణలో రెండు మూడు రోజుల్లో గండిని పూడ్చి సకాలంలో పంట పొలాలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎడమ కాలవ ఆయకట్టు పరిరక్షణ కమిటీ కన్వీనర్ మేకల నాగేశ్వరరావు,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంబాల శ్రీనివాస్,హుజూర్ నగర్ పట్టణ కార్యదర్శి జక్కుల రమేష్,కొత్త వెంకటేశ్వర్లు, యాకూబ్,పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.