తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేవాలయాలు అభివృద్ధి చెందాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ లో రూ.18 లక్షల వ్యయంతో చేపట్టనున్న అన్నదాన భవనం, అర్చక భవనం నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని, ప్రతి రోజు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారని తెలిపారు.
ఈ క్రమంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఈనెల 31 నుండి గణపతి నవరాత్రులు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని తెలిపారు.
హైదరాబాద్ లో నిర్వహించే శోభాయాత్రకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు.ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆరు లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు.