తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే ఆ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.దీనికి ప్రధాన కారణం ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతూ ఉండడమే అసలు కారణం.
మొదటి నుంచి కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాల ప్రభావం ఎక్కువ.పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే తపన కంటే తమ హవా పెంచుకోవాలనే విధంగానే పార్టీ నాయకులు ప్రయత్నిస్తుండడం వంటివి తెలంగాణ కాంగ్రెస్ కు శాపంగా మారాయి.
ఎప్పటికప్పుడు అధిష్టానం పార్టీ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా, నాయకుల తీరు మాత్రం మారడం లేదు.ముఖ్యంగా సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండడంతో, తమ హవానే సాగాలనే అభిప్రాయంతో ఉండడం జూనియర్ నాయకుల పెత్తనాన్ని ఒప్పుకోకపోవడం వంటివి కాంగ్రెస్ లో కల్లోలాలు పెరగడానికి కారణం అవుతున్నాయి.
ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల సందడి కనిపిస్తున్నా, కాంగ్రెస్ లో మాత్రం ఆ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టే నాయకులే కరువయ్యారు.ఈ సమయంలోను అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నాయకులు బిజీ బిజీగా ఉన్నారు.
మరోవైపు చూస్తే బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు పెద్ద ఎత్తున తమ పార్టీలోకి చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వ్యూహాత్మకంగాముందుకు వెళుతుండగా, కాంగ్రెస్ లో మాత్రం ఆ సందడి కనిపించకపోగా ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా నాయకులు వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో మొదలైన వివాదం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వరకు వెళ్ళింది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలో వివాదం ముగిసింది అనుకుంటున్న సమయంలోనే పార్టీ సీనియర్ నేత శశిధర్ రెడ్డి వ్యాఖ్యలు కలకం సృష్టించాయి.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని సమర్థిస్తూ రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్ వ్యవహార శైలిని శశిధర్ రెడ్డి తప్పుపట్టారు .దీంతో మరోసారి వివాదం మొదలైంది.పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి సైతం తన అసంతృప్తిని బయటపెట్టారు.
మాణిక్యం ఠాగూర్ తనతో మాట్లాడిన అంశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ఏఐసీసీ కార్యక్రమాలపై మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు తనను బాధపెట్టినట్లుగా మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారు.
ఇదిలా ఉంటే శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ సైతం ప్రకటన విడుదల చేశారు.తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చాలాకాలంగా సైలెంట్ గానే ఉంటున్నారు.
పార్టీ కార్యక్రమాలు వ్యవహారాలపై తాను స్పందించనని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నవంబర్ 5 వరకు ఇదే విధంగా వ్యవహరిస్తానని ఆ తరువాత తన అభిప్రాయాలు ఏమిటనేది చెబుతానని జగ్గారెడ్డి ప్రకటించారు.
ఇంకా అనేకమంది నాయకులు ఇదే విధంగా వ్యవహరిస్తూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు.