తెలంగాణ బిజెపిలో ఇప్పుడు పెద్ద ఎత్తున చేరికలు కనిపిస్తున్నాయి.కాంగ్రెస్, టీఆర్ఎస్ లోని కీలక నాయకులు అనుకున్న వారంతా ఒక్కొక్కరుగా ఇప్పుడు బిజెపి కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులు ఎవరెవరో గుర్తించి వారిని బిజెపిలో చేర్చుకునే వ్యూహానికి తెర తీశారు.తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు జరిగినా, ఎన్నికలకు తాము సిద్ధం అన్నట్లుగా బిజెపి సంకేతాలు ఇస్తూనే చేరికలపై ప్రత్యేక దృష్టి సారించింది.
తప్పకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తామనే నమ్మకము ఇప్పుడు బిజెపి నాయకుల్లో కనిపిస్తోంది.పార్టీలో చేరికలు రోజురోజుకు పెరుగుతుండడంతో తెలంగాణ బిజెపి నాయకులలోను నమ్మకం పెరుగుతోంది.
అయితే ఇదంతా జరగడానికి ప్రధాన కారణం కేంద్ర హోం మంత్రి, బిజెపి కీలక నాయకుడు అమిత్ షాగా తెలుస్తోంది.తెలంగాణపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతోనే ఈ స్థాయిలో బలోపేతం అవుతున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది.
ఈ ఏడాది సమయంలోనే మూడుసార్లు తెలంగాణలో అమిత్ షా అడుగు పెట్టారు.టిఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ఈ మేరకు తెలంగాణ బిజెపి నాయకులకు ఎప్పటికప్పుడు దేశానిర్దేశం చేయడంతో పాటు, తగిన విధంగా ప్రోత్సహిస్తూ చేరికలు ఎక్కువ ఉండేలా ప్రోత్సహిస్తూ ఉండడంతోనే బిజెపి ఈ స్థాయిలో బలోపేతం అయింది.అయితే తెలంగాణలో పార్టీ పరిస్థితి, రాజకీయ సమీకరణాలు తదితర అంశాలపై అమిత్ షా ప్రత్యేకంగా సర్వే బృందాలను రంగంలోకి దింపారని, ఆ సర్వే నివేదిక ఆధారంగానే ఆయన ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు సూచనలు చేస్తున్నారని విశ్వసనీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ముఖ్యంగా రాష్ట్రస్థాయిలో బిజెపి ఫర్వాలేదు అనుకున్నా, మెజారిటీ మండలాల్లో పార్టీ క్యాడర్ కు సరైన నాయకత్వం లేకపోవడం వంటి కారణాలతోనే బిజెపి క్షేత్రస్థాయిలో బలపడలేకపోతుందనే విషయాన్ని గుర్తించారు .ప్రతి జిల్లా, నియోజకవర్గంలోనూ కీలక నాయకులు అందరిని బిజెపిలో చేర్చుకోవాలని అమిత్ షా పదే పదే రాష్ట్ర నాయకులకు ఆదేశాలు ఇస్తున్నారట.
వీలైనన్నిసార్లు తెలంగాణకు వచ్చేందుకు ఎప్పుడూ సిద్ధమే అన్నట్లుగా సంకేతాలు ఇస్తుండడంతో తెలంగాణ బిజెపి నాయకులలోను ఉత్సాహం కనిపిస్తుంది.ఇక ఈనెల 21వ తేదీన తెలంగాణలో జరిగే భారీ బహిరంగ సభకు అమిత్ షా హాజరు కాబోతున్నారు.ఈ సందర్భంగానే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారు.రాజగోపాల్ రెడ్డి తో పాటు, తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్, ప్రవీణ్ రావు తదితరుల సమక్షంలో బిజెపి కండువా కప్పుకోబోతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో చేరికలు సాగుతూ ఉండడంతో, చేరికల కమిటీ కన్వీనర్ గా ఉన్న ఈటెల రాజేందర్ కు అధిష్టానం వద్ద క్రెడిట్ పెరుగుతోంది.