ఏపీలో తెలుగుదేశం పార్టీ కైనా , జనసేన పార్టీకైనా ఏకైక ప్రత్యర్థి వైసీపీ.ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేసేందుకు టిడిపి జనసేన తో పాటు బిజెపి విడివిడిగా పోరాటాలు చేస్తున్నాయి.
బిజెపి విషయంలో అందరికీ అనేక అనుమానాలు ఉన్నా, జనసేన టిడిపి మాత్రం పూర్తిగా అదే లక్ష్యంతో పనిచేస్తున్నాయి.అయితే తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు.
ఈ విషయంలో పవన్ సైతం అదే వైఖరితో ఉన్నారు.కానీ బిజెపితో పొత్తు కారణంగా టిడిపి తో పొత్తు అంశాన్ని ఎటు తేల్చుకోలేని పరిస్థితి . అయితే బిజెపి తో పొత్తు రద్దు చేసుకుని టిడిపితో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారని అంతా భావిస్తూ ఉండగానే, టిడిపి అధినేత దూకుడు పెంచారు.ప్రస్తుతం జిల్లాల పర్యటనలు చేపడుతూ, మినీ మహానాడు నిర్వహిస్తున్న చంద్రబాబు ఈ సందర్భంగా ఆయా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ముందుగానే ప్రకటించేస్తున్నారు.
ఎప్పుడూ ఎన్నికల సమయంలో తప్ప ముందుగా అభ్యర్థులను ప్రకటించని చంద్రబాబు ఇప్పుడు దూకుడుగా ఈ నిర్ణయాలు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.అయితే బాబు ఈ ఆకస్మిక నిర్ణయంతో పవన్ కూడా ఆలోచనలో పడ్డారట.
ఒకవైపు ఎన్నికలనాటికి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే సంకేతాలు అందరిలోనూ ఉండగానే తమను సంప్రదించకుండా బాబు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉండడంతో, దానికి కౌంటర్ గా ఇప్పుడు జనసేన తమకు బలమున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలని చూస్తోంది.

ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని కొన్ని కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా, ఒకవేళ టిడిపి తో పొత్తు ఉన్నా, ఆయా నియోజకవర్గాల్లో టిడిపి సీట్ల విషయంలో ఒత్తిడి చేయకుండా ఉపయోగపడుతుంది అనే నిర్ణయానికి పవన్ వచ్చారట.ఈ మేరకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపట్టి ఆ సమయంలోనే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలని పవన్ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ మేరకు తమకు గట్టి పట్టు ఉన్న, తప్పకుండా గెలుస్తాము అనే నియోజకవర్గాలు ఏంటి అనే విషయం పై ఆరా తీస్తున్నట్లు సమాచారం.







