సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే పార్టీలలో టిక్కెట్ల గోల ఉండటం షరామాములే.కానీ ఒక టిక్కెట్ కోసం ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే మాత్రం ఆ వ్యవహారం ఏ పార్టీకి అయినా తలనొప్పిగా మారడం ఖాయం.
ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ టిక్కెట్ ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు కత్తి మీద సవాల్గా మారనుంది.గుంటూరు వెస్ట్ టిక్కెట్ అటు వైసీపీలో, ఇటు టీడీపీలో చాలా మంది ఆశావహులు తమకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఇరు పార్టీలలో ఏకంగా ముగ్గురు, నలుగురు పోటీలో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.2014, 2019లో జరిగిన ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది.అయితే 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి వైసీపీలోకి జంప్ అయ్యారు.2014లో ఇక్కడి నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి లేళ్ల అప్పిరెడ్డి ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం లేళ్ల అప్పిరెడ్డికి వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఆయన ఎమ్మెల్యే పదవి కావాలనుకుంటే మాత్రం వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
అటు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం కూడా గుంటూరు వెస్ట్ టిక్కెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు.అటు మద్దాలి గిరిధర్ వెళ్లిపోయినా టీడీపీలో మాత్రం పోటీ తగ్గలేదు.ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర(నాని) తనకే టిక్కెట్ వస్తుందని ఆశిస్తున్నారు.
ఇదే టికెట్ కోసం మన్నవ మోహన్ కృష్ణ, భాష్యం ప్రవీణ్ కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నారు.
మరోవైపు 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.దీంతో గుంటూరు జిల్లా తెనాలిలో నాదెండ్ల మనోహర్ ఉండటంతో ఆ స్థానం జనసేన ఖాతాలోకి వెళ్లనుంది.ఈ నేపథ్యంలో అక్కడి టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఆలపాటి రాజా గుంటూరు వెస్ట్కు వస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇక్కడ ఎవరు పోటీ చేసినా టీడీపీకి బలం ఉన్న నేపథ్యంలో ఆలపాటి రాజా కూడా ఆశావహుల్లో ఉన్నారని తెలుస్తోంది.