బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ రానున్నారు.ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహించే సభకు విజయ సంకల్ప సభగా నామకరణం చేశారు.
తెలంగాణ బీజేపీ విధానాలను ప్రకటించడానికి, ప్రజలను చైతన్యం చేయడానికే ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్టు కమలనాథులు చెప్తున్నారు.దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ సభకు తరలిరానున్నారు.
అటు తెలంగాణ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడం ఇదే తొలిసారి అని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.ఈ సభకు 10 లక్షల మందిని తరలించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో రైలు నెట్వర్క్ అందుబాటులో ఉన్న నియోజకవర్గాల నుంచి, సుమారు 25 రైళ్లలో ప్రజలను సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.వర్షం వచ్చినా ఆటంకం లేకుండా, ప్రధాని బహిరంగసభలో వర్షం కురిసినా జనానికి ఇబ్బంది లేకుండా అధునాతన టెక్నాలజీతో కూడిన జర్మన్ హ్యాంగర్ టెంట్లను బీజేపీ నేతలు ఏర్పాటు చేస్తున్నారు.
అయితే బీజేపీ నిర్వహించే విజయ సంకల్ప సభ ద్వారా ఎవరికి విజయం.ఎవరికి సంకల్పం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని.విభజన చట్టంలో పేర్కొన్న పరిశ్రమలు, సంస్థలను కూడా కేంద్రం మంజూరు చేయడం లేదని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అప్పు చేసుకుంటామంటే అనుమతులు కూడా ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.అందుకే మోదీ రాకను వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీ నేతలు హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు.సాలు మోదీ.సంపకు మోదీ అంటూ బ్యానర్లను కూడా కడుతున్నారు.
మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలంగాణపై మోదీ ఎలాంటి సంకల్పం చెప్తారో అని టీఆర్ఎస్ నేతలు నిలదీస్తున్నారు.అటు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న బీజేపీ పార్టీ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తుందో అంటూ రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఏం చెప్పి తెలంగాణ ప్రజలను మోదీ బుట్టలో పడేస్తారో అని ఆసక్తి చూపుతున్నారు.మొత్తానికి మోదీ సభతో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి విజయం సిద్ధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.