యాదాద్రి జిల్లా:పొట్టకూటి కోసం కూలి పనికి వచ్చిన ఓ మైనర్ బాలికను తాపిమేస్త్రి బెదిరించి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో వెలుగుచూసింది.గురువారం రాజపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాజపేట మండలం బేగంపేటకు చెందిన నరసింహులు(35) సుతారిమేస్ట్రీగా పని చేస్తున్నాడు.
అదే మండలానికి చెందిన ఓ బాలిక అతని దగ్గర కూలీకి వచ్చేది.దీన్ని అదునుగా తీసుకున్న తాపిమేస్త్రి ఆమెను బెదిరించి శారీరకంగా లొంగదీసుకున్నాడు.
ఆమె భయంతో ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక అలాగే పనికి వెళుతుంది.దీనితో ఏడాది నుండి తనను బెదిరిస్తూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు బిడ్డను ఆరా తీయగా తాను కూలి పని చేస్తున్న మేస్త్రి సంవత్సరం నుంచి తనపై బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపింది.ప్రస్తుతం అమ్మాయి 8 నెలల గర్భవతని నిర్ధారణ అయినట్లు స్థానిక ఎస్సై తెలిపారు.
అదే విధంగా అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.