ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల జోష్ కనిపిస్తోంది.టిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నాయకులు, పదవులు ఆశించి భంగపడ్డ వారు ఇలా చాలామంది ఇప్పుడు వరుసగా కాంగ్రెస్ కండువా కప్పు కుంటున్నారు.
రాబోయే రోజుల్లో మరింతగా చేరికలు ఉండేలా కనిపిస్తున్నాయి.ఈ విషయంలో బిజెపి అంతగా ఆసక్తి చూపించకపోవడంతో దీన్నే అవకాశంగా మార్చుకుని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేరికలు మరింతగా ప్రోత్సహిస్తున్నారు.
వలసలతో కాంగ్రెస్ ను మరింతగా బలోపేతం చేసి సత్తా చాటుకోవాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను బలోపేతం చేసే విషయంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.
ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నాయకులను కాంగ్రెస్ లోకి తీసుకు రావడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు నాయకులను పార్టీలో చేర్చుకుని మరింత బలోపేతం అవ్వాలని చూస్తున్నారు.
అయితే ఈ చేరికలపై కాంగ్రెస్ సీనియర్లు మాత్రం అసంతృప్తి తో ఉన్నట్లు సమాచారం.తమకు సరైన సమాచారం ఇవ్వకుండానే రేవంత్ రెడ్డి వలసలను ప్రోత్సహిస్తున్నారని గురువుగా ఉన్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ లో చేరిన వారందరికీ టిక్కెట్లు ఇచ్చేది లేదని , మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని , టికెట్ల కేటాయింపు బాధ్యత ఎవరికీ లేదని అదంతా అధిష్టానమే చూసుకుంటుంది అంటూ బట్టి విక్రమార్క వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్ లో చేరారు.అయితే వీరి చేరికకు సంబంధించిన సమాచారం విక్రమార్కకు ఇవ్వకుండానే రేవంత్ చేర్చుకోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయన టికెట్ల కేటాయింపు విషయమై వ్యాఖ్యానించినట్లుగా అర్థమవుతోంది.