తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ప్రభావం గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం.బీజేపీని బలోపేతం చేసే విషయంలో ఆయన గట్టిగానే కష్టపడుతున్నారు.
అధికార పార్టీ టిఆర్ఎస్ పై ప్రజా పోరాటాలు చేపట్టడం, పాదయాత్ర ద్వారా బీజేపీ ని జనంలోకి తీసుకు వెళ్లడం ఇలా ఎన్నో విషయాల్లో సంజయ్ ఎంతగానో కష్టపడుతున్నారు.ఆయన బిజెపి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో బీజేపీని బలోపేతం చేయగలిగారు.
ఆ నమ్మకమే కేంద్ర బిజెపి పెద్దల వద్ద సంజయ్ పేరు ప్రఖ్యాతలు మారుమోగేలా చేశాయి.అందుకే తెలంగాణకు వచ్చిన కేంద్ర బిజెపి పెద్దలు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.
ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే సంజయ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.ఇటీవల తెలంగాణాకు వచ్చిన సందర్భంలో బండి సంజయ్ పై అమిత్ షా ప్రశంసలు కురిపించారు.
బండి సంజయ్ మాటలు వింటుంటే కెసిఆర్ ను అధికారానికి దూరం చేయడానికి తాను రావలసిన అవసరం లేదు అనిపిస్తుంది అని బండి పై తన నమ్మకాన్ని చాటిచెప్పారు.ఈ విధంగా సంజయ్ దూకుడు కొనసాగిస్తుండగానే ఆయనకు అనేక అడ్డంకులు, చికాకులు ఎదురవుతున్నాయట.
ముఖ్యంగా సీనియర్ నాయకులు వ్యవహారం సంజయ్ కు తలనొప్పిగా మారిందట.దీంతో తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కేంద్ర బిజెపి పెద్దలకు బండి సంజయ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ కోసం ఎంతగా కష్టపడుతున్నా, సొంత పార్టీ నేతలే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారని బిజెపి కేంద్ర పెద్దల దగ్గర ఫిర్యాదు చేసినట్లు సమాచారం.బండి సంజయ్ తీరు తో అసంతృప్తితో ఉన్న కొంతమంది నేతలు విడిగా సమావేశాలు నిర్వహించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.ప్రస్తుతం సంజయ్ ఫిర్యాదుతో తెలంగాణ బిజెపి లో గ్రూపు రాజకీయాలపై బిజెపి అధిష్టానం దృష్టి సారించిందట.త్వరలోనే ఈ గ్రూపు రాజకీయాలకు ఛెక్ పెట్టి సంజయ్ కు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చేసేందుకు బీజేపీ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగబోతున్నారట.