తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు ఈ మధ్యకాలంలో ఊపందుకున్నాయి.ప్రధానంగా టిఆర్ఎస్ ను బలహీనం చేసి తమ బలం పెంచుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భావిస్తూ ఉండటంతోనే ఆ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారు.
ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ ల లో ఉన్న అసంతృప్త నాయకులను గుర్తించి, కాంగ్రెస్ కండువా కప్పే వ్యూహానికి రేవంత్ రెడ్డి పదును పెట్టారు.ఈ మేరకు టిఆర్ఎస్ నుంచి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా చేరికలు ఉండేలా చూసుకుంటున్నారు .తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.దీనికి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు తగిన విధంగా సహకరిస్తూ, పూర్తి స్వేచ్ఛను రేవంత్ కు అప్పగించడంతో ఈ విషయంలో రేవంత్ మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
ఇప్పటికే ఖైరతాబాద్ కార్పొరేటర్ దివంగత పీజేఆర్ కుమార్తె విజయ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్ల తో పాటు, మరికొంతమంది కాంగ్రెస్ లో చేరారు.
ఇంకా నియోజకవర్గాల వారీగా చేరే వారి లిస్టు రేవంత్ సిద్ధం చేస్తున్నారు.టిఆర్ఎస్ సరైన రాజకీయ ప్రాధాన్యం లేదు అనుకునే వారు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదన్న అభిప్రాయానికి వచ్చిన వారు ఇలా చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారట.
ఈ చేరికలతో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని రేవంత్ భావిస్తుండగా, పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గస్థాయి నాయకులు మాత్రం ఈ పరిణామాలపై ఆందోళన, అసంతృప్తితో ఉన్నారట.ముఖ్యంగా విజయా రెడ్డి చేరికపై ఖైరతాబాద్ నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.ఇక తాటి వెంకటేశ్వర్లు చేరికపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు సమాచారమే లేదట. అంతేకాకుండా ఖమ్మం జిల్లా నుంచి రానున్న రోజుల్లో పెద్దఎత్తున చేరికలు ఉండబోతున్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించడంతో, తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఈ చేరికలు సీనియర్ నాయకులకు అసంతృప్తిని కలిగిస్తున్న ట్లు సమాచారం.