ఇటీవల కాలంలో విమానయాన సంస్థల తీరు వివాదాస్పదంగా మారుతోంది.సంపన్నుల సేవలో తరిస్తున్న విమానయాన సంస్థలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఒక్కోసారి అమానవీయంగా ప్రవర్తిస్తున్నాయి.తాజాగా ఇండిగో విమానయాన సంస్థ తీరు చర్చనీయాంశంగా మారింది.
ఆకలితో ఏడుస్తున్న తమ కుమార్తెకు ఆహారం ఇవ్వాలని ఓ ప్రయాణికుడు ఎంతగా వేడుకున్నా, విమానంలో సిబ్బంది కనికరించ లేదు.పైగా ముందుగా కార్పొరేట్ సిబ్బందికి అందజేసిన తర్వాత మిగిలిన వారికి ఇస్తామంటూ కటువుగా సమాధానం ఇచ్చారు.
తన బాధను సోషల్ మీడియాలో ఆ ప్రయాణికుడు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇండిగో విమానంలో సాధారణ తరగతిలో ఓ డాక్టర్ తన కుటుంబంతో కలిసి ఇటీవల ప్రయాణించాడు.అతడి ఆరేళ్ల కుమార్తె ఆకలితో బాగా ఏడ్చింది.దీంతో ఏదైనా ఆహారం ఉంటే తమకు ఇవ్వాలని, తమ కుమార్తె గుక్కపెట్టి ఏడుస్తోందని విమానంలో సిబ్బందిని ఆ ప్రయాణికుడు వేడుకున్నాడు.ఏ ఆహారం ఉన్నా తనకు పర్వాలేదని, అందుకు తగిన ధర కూడా ఇస్తానని బ్రతిమిలాడాడు.
అయితే తాము ముందుగా కార్పొరేట్ క్లయింట్కు సేవ చేస్తామని, చిన్నారికి ఆహారం ఇవ్వలేమని సిబ్బంది బదులిచ్చారు.ఆ చిన్నారి ప్రయాణం మొత్తం ఏడుస్తూనే ఉన్నా, వారు కనికరించలేదు.తన ప్రయాణం ముగిసిన తర్వాత బాధితుడు ట్విట్టర్లో తనకు ఎదురైన ఆ భయంకరమైన అనుభవాన్ని తెలిపాడు.“ఇండిగోలో గొప్ప అనుభవం ఎదురైంది.నా ఆరేళ్ల కుమార్తె ఆకలితో ఉంది. క్యాబిన్ సిబ్బందిని అందుబాటులో ఉన్న ఏదైనా ఆహారాన్ని ఇవ్వాలని, దాని కోసం ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని అభ్యర్థించాను.
ఫ్లైట్ మొత్తం నా కుమార్తె ఏడుస్తూనే ఉంది.కానీ వారు (క్యాబిన్ సిబ్బంది) ఆమెకు ఆహారం అందించలేదు” అన్నారాయన.తాను ఎన్నిసార్లు అడిగినా, క్యాబిన్ సిబ్బంది ముందుగా కార్పొరేట్ క్లయింట్కు సేవ చేయాలని భావించారని ఆయన వాపోయారు.ఫిర్యాదుపై ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది స్పందించింది.“సార్, మీరు ఏ బాధ అనుభవించారో మాకు అర్థమైంది.మీ కుమార్తె ఇప్పుడు క్షేమంగా ఉందని ఆశిస్తున్నాము.
మేము ఈ ఘటనను తప్పకుండా పరిశీలిస్తాము.రేపు పని వేళల్లో మిమ్మల్ని సంప్రదిస్తాము.” అని బదులిచ్చింది.ఈ ట్వీట్పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది.
చాలా మంది ఇండిగో సంస్థ తీరును తప్పుబట్టారు.మరికొందరు తల్లిదండ్రులే ఏదైనా ఆహారాన్ని తమ పిల్లల కోసం తీసుకెళ్లాలని సూచించారు.