ఏంటి ఆశ్చర్యం కలుగుతుందా? కానీ ఇది నిజమే.మీరు వింటున్నది అక్షరాలా నిజమే సుమీ.
ఈ డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి వింతపోకడలేమిటి అని అనుకుంటున్నారా? అవును.డిజిటల్ మీడియాపై అందరూ ఆధారపడుతున్న రోజులివి.
స్మార్ట్ఫోన్ ఇక్కడ రాజ్యమేలుతోంది.మనిషికి అత్యంత కీలకమైన వస్తువుగా స్మార్ట్ ఫోన్ మారింది.
ఇటువంటి కాలంలో మొబైల్ ఫోన్లు, టీవీలు అస్సలు వినియోగించని ఒక ప్రాంతం ఉందని తెలిస్తే ఎవరు మాత్రం నమ్ముతారు? కానీ ఇది నిజం.అక్కడికెళదాం పదండి.
ఆ ప్రాంతం పేరు గ్రీన్ బ్యాంక్.అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలోని పోకాహోంటాస్ సమీపంలో ఇది కలదు.
ఇక్కడ తక్కువలో తక్కువ ఓ 150 మంది జనాలు నివసిస్తున్నారు.అయితే వీరిలో ఏ ఒక్కరికీ టీవీలు, మొబైల్ ఫోన్లు కానీ లేవు.
గ్రీన్ బ్యాంక్ సిటీలో ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు.ఎందుకంటే ఈ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఉంది.
దీనిని “గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్” అని కూడా అంటారు.ఈ టెలిస్కోప్ 485 అడుగుల పొడవు వ్యాపించి వుంది.
ఈ భారీ టెలిస్కోప్ ఉన్నచోట US నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ఉంది.దీనిని 1958లో స్థాపించారు.
ఇక్కడ అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చే అలలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ నుండి బ్లాక్ హోల్స్ వరకు అధ్యయనం చేసే టెలిస్కోప్లు ఎక్కువగా ఉంటాయి.వీటి వినియోగంలో ఇబ్బందులు ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు.టీవీలు, రేడియోలు, మొబైల్ఫోన్లు, ఐప్యాడ్లు, వైర్లెస్ హెడ్ఫోన్లు మొదలైనవాటిని నిషేధించారు.ఇటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే తరంగాలు అంతరిక్షం నుండి వచ్చే తరంగాలను ప్రభావితం చేస్తాయి.