మన ఆధునిక జీవన విధానంలో సెల్ ఫోన్, ఇంటర్నెట్ భాగస్వామ్యం అయిపోయాయి.తిండి, నీరు లేకపోయినా పర్వాలేదు ‘నెట్ ‘ చూస్తూ బతికేస్తాము అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉంది.
ఇప్పుడు విద్య, ఉద్యోగం ఏదైనా ఇంటర్నెట్ తోనే ముడిపడి ఉంది.కానీ కొద్ది రోజుల క్రితం ఏపీ లోని అమలాపురం లో చోటుచేసుకున్న సంఘటన కోనసీమ వాసులకు ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా చేశాయి.
వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా ను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆ ప్రాంత వాసులు కొంతమంది ఈ వ్యవహారంపై ఆగ్రహం చెందారు.కోనసీమ సాధన సమితి పేరుతో ఉద్యమానికి తెర తీశారు.
ఆందోళనలు చేపట్టారు.చివరకు అది కాస్తా తీవ్రరూపం దాల్చి అమలాపురం లో మంత్రి, ఎమ్మెల్యే నివాసాల ను దహనం చేసే వరకు పరిస్థితి వెళ్ళింది.
ఈ వ్యవహారంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు నిర్వహించారు.
అంతేకాకుండా ఈ అల్లర్లు మరింత ముదరకుండా ఉండేందుకు అమలాపురం పట్టణంతో సహా కోనసీమ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసింది.
ఈ అల్లర్లకు సంబంధించి వాట్సాప్ మెసేజ్ లు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ వ్యవహారాన్ని మరింత రెచ్చగొట్ట కుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగుతూనే ఉంది.మరి కొద్ది రోజుల పాటు ఈ నిషేధం కొనసాగనుంది.అయితే ఈ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం నిర్వహిస్తున్న ఉద్యోగులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఈ సేవలు నిలిచిపోవడంతో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తమ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఇంటర్నెట్ అందుబాటులో ఉందో వెతుక్కుని మరి ఆ ప్రాంతాలకు వెళ్లి తమ విధులను నిర్వర్తిస్తున్నారు.ఇంటర్నెట్ ఆధారంగా చేసుకుని ఆదాయం పొందుతున్న అనేకమంది ఈ ప్రాంత వాసులు ఈ సేవలను ప్రభుత్వం ఎప్పుడు పునరుద్ధరిస్తుండా అని ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.