ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం వద్ద టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.మూడేళ్ల తర్వాత టీడీపీ మహానాడు జరుగుతోంది.
ఈ సందర్భంగా మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒక విషయాన్ని స్పష్టం చేశారు.పార్టీ కోసం పనిచేసేవాళ్లకు మాత్రమే వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కిస్తామని చెప్పారు.దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీలో సమూల మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది.
అయితే టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఎదగాలంటే సీనియర్ల కంటే యువతే అవసరమని నమ్ముతోంది.అందుకే మహానాడులోనూ చంద్రబాబు ఈ విషయాన్నే క్లారిటీగా చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ యువతను ఆకర్షించి వారిని పార్టీలో చేర్చుకుని యువ రక్తంతో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.దీని కోసం చంద్రబాబు భారీగానే కసరత్తు మొదలుపెట్టారు.
ఇప్పటికే పలు పార్టీ సమావేశాల్లో సీనియర్లు వచ్చే ఎన్నికల్లో త్యాగం చేయాలని షరతు పెట్టారు.ప్రస్తుతం టీడీపీలో యువ లీడర్లను వేళ్లపై లెక్కపెట్టే పరిస్థితి ఉంది.పరిటాల శ్రీరామ్, రామ్మోహన్ నాయుడు, జేసీ పవన్ రెడ్డి, బొజ్జల సుధీర్ వంటి నాయకులు తప్ప పెద్దగా యూత్ లీడర్ల ఫాలోయింగ్ టీడీపీలో తక్కువగా ఉంది.2019లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కొద్దో గొప్పో ఉన్న యువ నేతలు కూడా వైసీపీలో చేరిపోయారు.ఉన్నవారిలో కొందరు అప్పుడప్పుడు లోకేష్ దగ్గర అటెండెన్స్ వేయించుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నదేమీ లేదని కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది.
దీంతో వచ్చే ఎన్నికల్లో యువతకే 40 శాతం సీట్లు కేటాయిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.అయితే మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న తరుణంలో యువ ఓటర్లను ఆకర్షించాలంటే పార్టీలోని యువ లీడర్లు గ్రౌండ్ లెవల్లో కష్టపడి పనిచేయాలని.ఇప్పటి నుంచే పార్టీ వ్యూహాలు రూపొందించుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా పరిస్థితులను ఆ పార్టీ మరింత అనుకూలంగా మార్చుకుంటే ఎన్నికల్లో సానుకూల ఫలితాలను రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.
.