కెనడాలో రెండు వరుస సంఘటనలలో ఇద్దరు భారతీయ విద్యార్థులు నీటిలో మునిగి దుర్మరణం పాలవ్వడంపై కెనడా రాజధాని ఒట్టావాలోని భారత హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.విద్యార్థులు ఈత కొట్టే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అడ్వైజరీ జారీ చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన రెండు విషాద సంఘటనల తర్వాత ఈతకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ట్విట్టర్ లో సూచనలు చేసింది.
భారతీయ విద్యార్థులు స్థానిక చట్టాలను పాటించాలని, లైఫ్ జాకెట్స్ ధరించకుండా, చట్టం సూచించిన ఇతర జాగ్రత్తలు తీసుకోకుండా చెరువులు, సరస్సులు లేదా నదులలో ఈత కొట్టడం లేదా డైవింగ్ చేయడం మానుకోవాలని, ఈత తెలియని వారు సరైన పర్యవేక్షణ లేకుండా ఈత నేర్చుకునే ప్రయత్నం చేయరాదని హితవు పలికింది.
కొన్నిసార్లు విద్యార్థులు గుంపులుగా వెళ్లి వాటర్ స్పోర్ట్స్ ఆడుతున్న సంఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని ఇది ప్రమాదాలకు, ప్రాణ నష్టానికి దారితీయవచ్చు అని హైకమీషన్ ఆందోళన వ్యక్తం చేసింది.కనుక తమకు, తమ కుటుంబాలకు ఎటువంటి ప్రమాదాలు, బాధలు కలుగకుండా చూసుకోవడం ప్రతిఒక్క విద్యార్థి బాధ్యత అని అని హైకమిషన్ పేర్కొంది.
కాగా.కెనడాలో ఈ నెలలో కూడా ఓ భారతీయ విద్యార్ధి ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
యువకుడిని పంజాబ్ రాష్ట్రం మోగా జిల్లాలోని నిహల్సింగ్ వాలా సబ్ డివిజన్లోని బధ్నీ కలాన్ గ్రామానికి చెందిన నవకిరణ్ సింగ్గా గుర్తించారు.ఇతను ఉన్నత విద్య కోసం గతేడాది కెనడాకు వెళ్లాడు.
ఈ క్రమంలో అంటారియో ప్రావిన్స్లోని బ్రాంప్టన్లో వున్న ఎల్డోరాడో పార్క్కు స్నేహితులతో కలిసి వెళ్లాడు కిరణ్.అయితే అక్కడ ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
అతని మరణవార్తను స్నేహితులు భారత్లోని తల్లిదండ్రులకు తెలియజేశారు.ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్పస్థాయికి చేరుకుంటాడనుకున్న కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.