ఏపీలో జిల్లాల విభజన కారణంగా సీమ జిల్లాల రూపురేఖలు మారిపోయాయి.గతంలో కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలను మాత్రమే రాయలసీమ జిల్లాలుగా పరిగణించేవారు.
అయితే జిల్లాల విభజన తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా రాయలసీమలో భాగమయ్యాయి.గతంలో ఉన్న నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలిపి గ్రాండ్ రాయలసీమగా పిలుస్తున్నారు.
ఈ జిల్లాలలో రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.నవ్యాంధ్ర ఏర్పడిన నాటి నుంచి ఈ జిల్లాలలో రాజకీయం వైసీపీకే అనుకూలంగా ఉంటోంది.2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా గ్రాండ్ రాయలసీమ జిల్లాలలో మాత్రం వైసీపీ హవానే కొనసాగింది.ఆ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా ఈ జిల్లాల నుంచే 67 సీట్లు వచ్చాయి.
ఇక 2019 ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దాదాపుగా జిల్లాలకు జిల్లాలనే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
ఈ ఆరు జిల్లాలలో టీడీపీకి 10కి మించి సీట్లు రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటిది ఇప్పుడు వైసీపీ ఫ్యాన్కు ఎదురుగాలి వీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జగన్ సీఎం అయితే తన తండ్రి మాదిరిగా బ్రహ్మాండంగా పాలిస్తారనుకున్న వారి ఆశలు అడియాశలే అయ్యాయని ప్రచారం జరుగుతోంది.సీమ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సంగతిని వైసీపీ సర్కారు పూర్తిగా అటకెక్కించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అభివృద్ధి ఊసే లేదు.పైగా అధికార పార్టీలో వర్గ విభేదాలు మరింత వ్యతిరేకతను చాటుతున్నాయి.
ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఇళ్ల పథకంలో వైసీపీ నేతలు తలదూర్చి లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.దీంతో రాయలసీమలోని కొన్ని జిల్లాలలో ఈసారి వైసీపీకి ఎదురుగాలి తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాలలో గతంలో మాదిరి వైసీపీకి సీట్లు వచ్చే పరిస్థితులు లేవని వివరిస్తున్నారు.వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వైసీపీ అధినేత జగన్ పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే ఫ్యాన్ తిరగడం ఆగిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
.