ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఫెడరల్ ఎన్నికల్లో భారతీయ ప్రవాసులు తమ ఉనికిని చాటుకుంటున్నారు.ప్రధాన రాజకీయ పార్టీలు వారిని ప్రలోభ పెట్టడానికి ఏం చేయాలో అన్ని చేస్తున్నాయి.
ఇందుకోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వారు విడిచిపెట్టడం లేదు.మే 21 సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత 47వ ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీల భవితవ్యం తేలనుంది.
ప్రధాని స్కాట్ మోరిసన్ , ప్రతిపక్షనేత ఆంథోనీ అల్బనీస్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలైన లిబరల్ , లేబర్ పార్టీలు.
ఈ ఎన్నికల్లో భారత మూలాలు వున్న అభ్యర్ధులను నిలబెట్టడమే కాకుండా వివిధ మత, సాంస్కృతిక సంస్థలకు మిలియన్ డాలర్ల గ్రాంట్లను ప్రకటించాయి.తద్వారా భారతీయ సమాజం నుంచి ఓట్లను గంపగుత్తగా పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.అలాగే వలసదారులు ఎదుర్కొంటున్న పేరెంట్ వీసాలు, ఉపాధి కల్పన వంటి కీలక సమస్యల పరిష్కారానికి సైతం హామీ ఇచ్చాయి.
151 సీట్లున్న ఆస్ట్రేలియా ప్రతినిధుల సభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 76.స్కాట్ మోరిసన్ ప్రభుత్వానికి ప్రస్తుతం 76 సీట్లు వుండగా.లేబర్ పార్టీకి 68 సీట్లు వున్నాయి.
ప్రధానితో సహా అగ్ర నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మతపరమైన, సాంస్కృతిక కార్యక్రమాలతో సహా ప్రార్ధనా కేంద్రాలను సందర్శిస్తున్నారు.ప్రధాని మోరిసన్ అతని భార్య జెన్నీ మోరిసన్ సహా మంత్రులు అలెక్స్, బెన్ మోర్టన్ తదితరులు సిడ్నీలోని హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అటు లేబర్ పార్టీ నేత ఆంథోనీ అల్బనీస్ కూడా భారత సంతతి ఓటర్లను కలుసుకోవడానికి ఇటీవల హిందూ కౌన్సిల్ను సందర్శించారు.అలాగే ఆస్ట్రేలియాలో పెద్ద సంఖ్యలో వున్న పంజాబీలను ప్రసన్నం చేసుకోవడానికి గురుద్వారాలకు కూడా వెళ్తున్నారు.
ఇకపోతే… ఈ ఎన్నికల్లో ఆరుగురు పంజాబీలు సహా 17 మంది భారత సంతతి అభ్యర్ధులు బరిలో నిలిచారు.క్వీన్స్లాండ్ నుంచి గ్రీన్పార్టీ టిక్కెట్పై నవ్దీప్ సింగ్ సిద్ధూ, మాకిన్ నుంచి రాజన్ వైద్ (వన్ నేషన్ పార్టీ), చిఫ్లీ నుంచి జుగన్ దీప్ సింగ్ (లిబరల్ పార్టీ), గ్రీన్ వే నుంచి లవ్ప్రీత్ సింగ్ నందా (ఇండిపెండెంట్), త్రిమాన్ గిల్ (ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ) , హర్మీత్ కౌర్ (గ్రూప్ ఎం)లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
వెంట్వర్త్ నుంచి లిబరల్ పార్టీ టిక్కెట్పై సిట్టింగ్ ఎంపీ దేవ్ శర్మ మరోసారి పోటీ చేస్తున్నారు.2019 ఎన్నికల్లో సిడ్నీ సబర్బ్లో గెలిచిన ఆయన.ఆస్ట్రేలియా పార్లమెంట్లో తొలి భారత సంతతి సభ్యుడిగా చరిత్ర సృష్టించారు.ఆగస్ట్ 2010లో జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో టాస్మానియా రాష్ట్రం నుంచి లిసా సింగ్ సెనేటర్గా ఎన్నికయ్యారు.
తద్వారా ఆస్ట్రేలియా పార్లమెంట్కు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కారు.