వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఇప్పుడు ఆయా దేశాలను శాసించే స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులుగా కీలక హోదాల్లో వున్నారు.ఇక పలు దేశాల్లో జరిగే ఎన్నికల్లో భారతీయులు నిర్ణయాత్మక శక్తిగా వున్న సంగతి తెలిసిందే.మరోవైపు…కెనడా, బ్రిటన్, అమెరికా చట్టసభలలో తమ ఉనికిని చాటుకుంటున్న భారతీయులు ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఫెడరల్, సెనేట్ ఎన్నికల్లో తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.దిగువ సభలోని మొత్తం 151 స్థానాలకు, ఎగువ సభలోని 76 స్థానాలకు గాను 40 స్థానాలకు మే 21న ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో ఆరుగురు పంజాబీలు సహా 17 మంది భారత సంతతి అభ్యర్ధులు బరిలో నిలిచారు.
క్వీన్స్లాండ్ నుంచి గ్రీన్పార్టీ టిక్కెట్పై నవ్దీప్ సింగ్ సిద్ధూ, మాకిన్ నుంచి రాజన్ వైద్ (వన్ నేషన్ పార్టీ), చిఫ్లీ నుంచి జుగన్ దీప్ సింగ్ (లిబరల్ పార్టీ), గ్రీన్ వే నుంచి లవ్ప్రీత్ సింగ్ నందా (ఇండిపెండెంట్), త్రిమాన్ గిల్ (ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ) , హర్మీత్ కౌర్ (గ్రూప్ ఎం)లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
వెంట్వర్త్ నుంచి లిబరల్ పార్టీ టిక్కెట్పై సిట్టింగ్ ఎంపీ దేవ్ శర్మ మరోసారి పోటీ చేస్తున్నారు.2019 ఎన్నికల్లో సిడ్నీ సబర్బ్లో గెలిచిన ఆయన.ఆస్ట్రేలియా పార్లమెంట్లో తొలి భారత సంతతి సభ్యుడిగా చరిత్ర సృష్టించారు.ఆగస్ట్ 2010లో జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో టాస్మానియా రాష్ట్రం నుంచి లిసా సింగ్ సెనేటర్గా ఎన్నికయ్యారు.తద్వారా ఆస్ట్రేలియా పార్లమెంట్కు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా ఆమె రికార్డుల్లోకెక్కారు.
ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు సాంస్కృతిక సంస్థలకు మిలియన్ డాలర్లు వాగ్థానం చేయడం ద్వారా భారత సమాజాన్ని ఆకర్షించే ప్రయత్నం చేశాయి.అలాగే భారత మూలాలున్న అభ్యర్ధులను రంగంలోకి దించాయి.ప్రధానంగా పశ్చిమ సిడ్నీ స్థానాలైన గ్రీన్వే, పర్రామట్టా, లా ట్రోబ్, విక్టోరియన్ వంటి వాటిపై ఫోకస్ చేశాయి.