ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు సీఎం జగన్ దావోస్ వెళ్లారు.శుక్రవారం ఉదయం గన్నవరం నుంచి బయలుదేరిన ఆయన శుక్రవారం రాత్రి పొద్దుపోయాక దావోస్ చేరుకున్నారు.
కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా రెండేళ్ల తర్వాత దావోస్లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
ఐదు రోజుల పాటు సాగే ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్ వేదికగా సీఎం జగన్ చర్చించనున్నారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలతో పాటు కరోనా నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీట్మెంట్ అంశాలను కూడా జగన్ టీమ్ అక్కడి పారిశ్రామికవేత్తలకు వివరించనుంది.ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా, ఆర్థిక పరిస్థితులు వంటి కీలక సవాళ్లకు పరిష్కారం కోసం దావోస్ వేదిక ద్వారా ఏపీ భాగస్వామ్యం కానుంది.
ఇందుకోసం పీపుల్-ప్రోగ్రెస్-పాజిబిలిటీస్ అనే నినాదంతో దావోస్లో ఏపీ కోసం కూడా అధికారులు ఓ పెవిలియన్ను ఏర్పాటు చేశారు.విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులతో పాటు మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుల నిర్మాణంతో పాటు కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్పోర్టుల అభివృద్ధి పారిశ్రామికీకరణకు ఎలా దోహదపడుతుందో ఈ సదస్సు ద్వారా జగన్ వివరించనున్నారు.
మరోవైపు బెంగళూరు-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు, విశాఖ-చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను దావోస్ సదస్సులో సీఎం జగన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.తన హయాంలో ఏపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పుల గురించి, నవరత్నాల అమలు గురించి, అధికార వికేంద్రీకరణ గురించి, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెచ్చిన మార్పుల గురించి కూడా జగన్ సవివరంగా పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
కాలుష్యం లేని పారిశ్రామిక ఆర్థిక ప్రగతి దిశగా చేపట్టిన కార్యక్రమాలను సీఎం జగన్ వివరించనున్నారు.మొత్తానికి జగన్ దావోస్ పర్యటన ఏపీకి పెట్టుబడులు తెస్తుందా.ఒకవేళ తెచ్చేటట్లయితే ఎన్ని కోట్ల పెట్టుబడులను తీసుకువస్తారు అన్న అంశం ఆసక్తికరంగా మారింది.
.