మన దేశం ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు.ఆచార వ్యవహారాలతో పాటు, కొన్ని నమ్మకాలను కూడా ఎంతగానో విశ్వసిస్తారు.
ఇంటి బయట, దుకాణం బయట నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడం చాలా మంది చూసే ఉంటారు.ఇలా నిమ్మకాయలు, మిరపకాయలు కట్టడంవల్ల మన ఇంటికి ఎలాంటి చెడు దృష్టి తగలదని, ఎలాంటి ఆత్మలు, ప్రేతాత్మలు దరి చేరవని చెబుతారు.
నిజానికి అసలు కారణం ఇదికాదు.రాత్రి సమయంలో కూడా కరెంటు లేకపోవటం వల్ల ఎన్నో క్రిమికీటకాలు ఇంటిలోకి వచ్చేవి.
అయితే ఈ క్రిమికీటకాల నుంచి రక్షణ పొందడానికి నిమ్మకాయలను మిరపకాయలను సూదితో గుచ్చడం వల్ల అందులో ఉన్నటువంటి విటమిన్స్, నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ వాసనలు బయటకు వెదజల్లడం వల్ల ఎలాంటి క్రిమికీటకాలు దరిచేరవు.ఈ కారణం చేత పూర్వకాలంలో పెద్దవారు ఇంటి గుమ్మానికి పచ్చిమిరపకాయలు నిమ్మకాయను దారంతో వ్రేలాడ తీసేవారు.
నదిలో నాణేలు వేయడం ఎందుకు.?
రాగి పాత్రలకు, రాగి నాణేలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది.ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది.అందుకే రాగి నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, దాని వల్ల తాగునీటిలో ఎలాంటి కలుషితాలు ఉన్నా తొలగిపోతాయని అలా చేసేవారు.
పైగా అప్పట్లో అంతా నదుల్లో నీటిని నేరుగా తాగేవారు.ఇప్పటిలా ఫిల్టర్లు లేవు.అందుకే రాగి నాణేలు వేసి నీటిని శుభ్రపరిచేవారు.ఈ రోజుల్లో రాగి నాణేలు లేవు అయినా నదిలో నాణేలు వేయడం మాత్రం ఎవ్వరూ మానుకోరు.
పిల్లిని చూసి ఆగడం
మనం బయటికి వెళ్లేటప్పుడు పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తారు.నిజానికి పూర్వ కాలంలో వ్యాపారులు ఎద్దుల బండ్లు, గుర్రాల మీద చాలా దూరం ప్రయాణించేవారు.రాత్రిపూట అడవి గుండా వెళుతున్నప్పడు పిల్లి కనిపిస్తే దాని కళ్ళు మెరుస్తూ ఉండేవి.ఎద్దులు, గుర్రాలు ఈ మెరుపుని చూసి భయపడేవి.అందుకే వ్యాపారులు కొంత సేపు ప్రయాణం ఆపేసి జంతువులకి కొంతసేపు విశ్రాంతి ఇచ్చేవారు.ఈ విషయం అర్థంకాక ఇప్పటికీ చాలా మంది పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తారు.