సంకల్పబలంతో నిరంతరం తపిస్తే విజయాలను అందిపుచ్చుకోగలుగుతామని, రేపటి భవిష్యత్తులో విజేతలు అవ్వటానికి మీకు మాత్రమే అవకాశం ఉందని ఆ వైపుగా నిబద్ధత ఏకాగ్రత అకుంఠిత దీక్షతో కష్టపడాలని ప్రముఖ కవి రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణుడు అట్లూరి వెంకటరమణ స్పష్టం చేశారు.ఖమ్మంలోని నయాబజార్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె గాయత్రి అధ్యక్షతన జరిగిన పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అట్లూరి వెంకటరమణ మాట్లాడుతూ ఒకసారి లభించే ఈ జన్మలో మీదైన ముద్ర సంతకం శాశ్వతంగా ఈ ప్రపంచం పై ఉండాలంటే పట్టుదల, ఆకాంక్ష, నిజాయితీ, నేను మాత్రమే సాధించగలననే ధీమా నిరంతరం మనసులో ఉండాలని నిర్దేశించారు.
ప్రపంచంలో సాధించే విజయాలకు ప్రథమంగా సంతోషించేవారు తల్లిదండ్రులని, తాము ఏ స్థితిలో ఉన్న మీ మీ చదువు కోసం భవిష్యత్తు కోసం త్యాగాలు చేస్తూ మీరే వారి ఊపిరిగా జీవిస్తున్నారని అటువంటి వారిని సంతోష పెట్టే విధంగా గెలుపే లక్ష్యంగా మార్చుకోవాలని కోరారు.గత పది సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో విద్యనభ్యసించిన మీకు ఆనాటి నుండి ఈనాటి వరకు చదువు చెప్పిన ప్రతి గురువును స్మరించుకుని వారి ఆశీస్సులతో పదవ తరగతి పరీక్షల్లో అద్భుత విజయాన్ని అందుకోవాలని అట్లూరి ఆకాంక్షించారు.
రేపటి సమాజాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాల్సిన గురుతర బాధ్యత మీ మీద ఉందని విద్యార్థులకు అట్లూరి కర్తవ్యబోధ చేశారు.అనంతరం విద్యార్థులకు పెన్నులు, రైటింగ్ పాడ్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి కిషోర్, గోవిందరెడ్డి, జి వెంకటేశ్వర్లు,శ్రీ హర్ష విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.