ఏపీలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది.రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల జపమే చేస్తున్నాయి.దీంతో నిత్యం ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి.ఇటు అధికార పార్టీ.అటు విపక్షాలు ప్రజల్లోనే ఉండేలా వ్యూహాలు రచిస్తున్నాయి.ఇతర పార్టీలతో పోల్చుకుంటే అధికార వైసీపీ దూకుడుగా కనిపిస్తోంది.
గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలతో పాటు సీఎం జగన్ బహిరంగ సభలను నిర్వహిస్తోంది.
అయితే ఏపీలో త్వరలోనే అసెంబ్లీ రద్దు అవుతుందంటూ వైసీపీ వ్యతిరేక మీడియా ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఏడాది నవంబర్లో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి.వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగడం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి.అందుకే అధికార, విపక్షాలు ఎన్నికల హడావిడిలో పడిపోయాయని తేల్చి చెప్తున్నాయి.
మంగళవారం నాడు టీడీపీ సీనియర్ నేతల సమావేశంలోనూ ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు చర్చించారట.
ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని కాబట్టి నేతలంతా అందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టంగా ఆదేశించారట.అయితే ముందస్తు ఎన్నికలపై ప్రకటన చేయాల్సింది సీఎం జగన్ అనే విషయాన్ని ఓ వర్గం మీడియా పూర్తిగా విస్మరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.తమ ప్రభుత్వాన్ని ఎప్పుడు రద్దుచేసుకోవాలనే విషయం పూర్తిగా జగన్ ఇష్టమని… అలాంటి ఆయనే ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదని వాళ్లు గుర్తు చేస్తున్నారు.
ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత ఉందని జగన్ భావించినా… తాము రెండోసారి అధికారంలోకి రామనే అనుమానం ఉన్నా.పూర్తికాలం అధికారంలో ఉండాలని ఆయన కోరుకుంటారే తప్ప ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓడిపోవాలని ఎలా భావిస్తారని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.
కానీ అధికార పార్టీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ మంత్రులతో బస్సు యాత్రలు, ఎమ్మెల్యేలతో గడప గడపకు వంటి కార్యక్రమాలు చేపట్టడంతో ముందస్తు ఎన్నికల వ్యవహారం అంతుచిక్కడం లేదు.